తెలంగాణలో ఆంధ్రావారిపై దాడి.. పవన్ ఎందుకు వ్యాఖ్యలు చేశారంటే.. అసలు కారణం..
Recommended Video

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సినీ తారల చేరడంతో రాజకీయాలు వేడెక్కడమే కాకుండా వివాదాస్పదం అవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రావారిపై తెలంగాణలో దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఆస్తులను కబ్జా చేస్తున్నారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేయడం అత్యంత వివాదాస్పదమయ్యాయి. అయితే పవన్ కల్యాణ్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారనే అంశంపై రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయనే మాట బలంగా వినిపిస్తున్నది. అయితే మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఊహాగానాలు, రూమర్లు ఇవే..

కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ వ్యాఖ్యలతో
ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్టు ఇస్తామని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో కొంత గందరగోళానికి కారణం అవుతున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆస్తులు ఉన్న ప్రముఖులపై తెలంగాణ రాజకీయ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ కారణంగానే కొందరు సినీ ప్రముఖులు ప్రచారానికి కూడా వెళ్లడం లేదనే మాట వినిపిస్తున్నది.

సినీ ప్రముఖులకు బెదిరింపులు
కాగా జనసేనకు బహిరంగంగా మద్దతు తెలిపే కొందరు ప్రముఖులు, సెలబ్రిటీలను కూడా బెదిరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే కమెడియన్ అలీ వైసీపీలో చేరడం జరిగిందని కొన్ని వర్గాలు ప్రచారం చేసుకొంటున్నాయి. ఏపీలోని కొందరు నేతలను పార్టీలు మార్పించేందుకు రకరకాల ప్రయత్నాలు హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నట్టు ప్రచారం విస్తృతంగా జరుగుతున్నది.

రాజకీయ శక్తుల వ్యూహాలు, ఎత్తులు
తెలుగుదేశం, జనసేన పార్టీల నేతలను సైలెంట్ చేయడంలోనూ, ఆయా పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేలా చేయడంలో తెలంగాణలోని బలమైన శక్తులు పనిచేస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారనే మాట వినిపిస్తున్నది.

సినీ ప్రముఖులను అనుకూలంగా చేసుకోవడం
తెలుగు సినీ ప్రముఖులు అలీ, వంశీ, చిన్నికృష్ణ లాంటి వారిని తెలంగాణలోని ఓ బలమైన వర్గం తమకు అనుకూలంగా మలచుకోవడంలో సఫలమైందని, అలాగే ఇంకా కొందరు సినీ అగ్రనటులను, సీనియర్ హీరోయిన్లను కూడా బెదిరించినట్టు ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి వార్తలు బయట ప్రచారం జరుగుతుండటంతో పవన్ ఆవేశంగా తన గళాన్ని వినిపించాడని, తెలంగాణ ప్రభుత్వంపై ప్రత్యక్షదాడికి దిగడం జరిగిందనే మాట వినిపిస్తున్నది. ఈ వార్తల్లో ఎంత వాస్తవముందో అనే అంశాలపై రెండు రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











