పెద్ద ఎన్టీఆర్ మ్యాజికల్ తేదీకే పవన్ టార్గెట్?
హైదరాబాద్: తెలుగు వారి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే దృఢ సంకల్పంతో, కోట్లాది తెలుగు ప్రజల గుండె చప్పుడుగా తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29న ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. తెలుగు దేశం పార్టీని స్థాపించిన 9 నెలలలోనే ఊడలు దిగిన కాంగ్రెస్ మహా వృక్షాన్ని ఒంటి చేత్తో పెకలించి వేసి, ఢిల్లీ పీఠాన్ని గజగజ వణికించి రాష్ట్రంలో తెలుగు దేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలుగు వారి పౌరుషాన్ని, ప్రతాపాన్ని దేశానికి చాటారు ఎన్టీఆర్. ఇప్పుడు అదే తేదీని తన రాజకీయ ఎంట్రీకి సైతం పవన్ ఎన్నుకునే అవకాసం ఉందనే వార్తలు అంతటా వినిపిస్తున్నాయి. మొదట అనుకున్నట్లుగా మార్చి 14న పొలిటికల్ ఎంట్రీ కి సంభందించిన మీటింగ్ పెట్టి, 29న పూర్తి స్ట్రక్చర్ ని ప్రకటిస్తాడని అంటున్నారు.
సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అంటూ తెలుగు దేశం పార్టీ పుట్టింది. ఎన్టీఆర్ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రెండు రూపాయలకు కిలో బియ్యం, పేదలకు పక్కా ఇళ్ళు, సగం ధరలకే జనతా చీరలు, పంచెలు, రెైతులకు రూ.50కే హార్స్ పవర్ విద్యుత్ వంటి పథకాలతో బడుగులకు ఉపశమనం కల్పించారు. మండల వ్యవస్థను ఏర్పాటు చేసి పరిపాలనను ప్రజల ముంగిటికి చేర్చారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దుచేసి ప్యూడల్ వ్యవస్థ అవశేషానికి చరమగీతం పాడారు. శాసన మండలి రద్దు,మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించే చట్టాలు తెచ్చారు. మహిళలకోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ అంశాలన్నిటినీ పవన్ పరిశీలుస్తున్నారని, రాజకీయాల్లో తనదైన ముద్రను ఆయన వెయ్యటానికి సిద్దమవుతున్నారని అంటున్నారు.

ప్రభుత్వోద్యోగాలలో 3వ వంతు స్ర్తీలకు రిజర్వేషన్ కల్పించారు. స్థానిక సంస్థల్లో తొలిసారి బీసీలకు, మహిళలను రిజర్వేషన్ కల్పించారు. దశాబ్దాలపాటు అగ్రకులాల పీడనలో నలిగిపోయిన బడుగు బలహీన వర్గాలకు రాజకీయ స్వేచ్ఛ కల్పించారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల జీవితాల్లో ఊహించని మార్పులు తెచ్చారు. అప్పటివరకూ కాంగ్రెస్ పార్టీ వారు ఈ వర్గాలవారిని ఓటు బ్యాంకులుగానే వాడుకున్నారు. ఎన్టీర్ బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి, వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పించినందునే నాటినుంచి నేటి వరకూ బీసీ వర్గాలవారు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. అలాగే పవన్ సైతం బి.సి లపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది.
పవన్కళ్యాణ్ కొత్త పార్టీ పేరును 'జనసేన' గా నిర్ణయించారు. 14వ తేదీన పార్టీ పేరు, పార్టీ విధివిధానాలు పవన్ ప్రకటించనున్నాట్లు సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. పవన్కల్యాణ్ పార్టీ పెట్టబోతున్నారనే వార్తపై చిరంజీవి తనయుడు రామ్చరణ్ స్పందించారు. రాజకీయాలపై తనకు అవగాహన లేదంటూనే పార్టీ స్థాపన అనేది బాబాయ్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయమని, ఆపడానికి ఎవరికి హక్కు లేదని పేర్కొన్నారు.
అలాగే... పవన్ కల్యాణ్ రాజకీయాలపై తన అభిప్రాయాలను ఇప్పటికే అక్షరబద్ధం చేసినట్లు సమాచారం. మీడియా సమావేశం అనంతరం ఆ పుస్తకాన్ని కూడా ఆవిష్కరిస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో ఈ పుస్తకం ఉండేలా చూడాలని భావిస్తున్నారు. ఈసారికి మొత్తం అన్ని స్థానాల్లో కాకుండా... 9 లోక్సభ, 40 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే 'పవన్ పార్టీ' పోటీ చేస్తుందని తెలుస్తోంది.
మొత్తానికి... ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో పవన్ కల్యాణ్ మిత్రులు, సన్నిహితులు, ఆత్మీయులు పార్టీ ఏర్పాటు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్టు సమాచారం. యువతను లక్ష్యంగా చేసుకుని ఈ పార్టీ పెడుతున్నట్లు భావిస్తున్నారు. అయితే, ఇది అచ్చంగా రాజకీయ పార్టీగా కాకుండా, 'రాజకీయ వేదిక'గా ఉంటుందని కూడా పేర్కొంటున్నారు. పవన్ కల్యాణ్ స్వయంగా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని, బహుశా... మల్కాజిగిరి లేదా కాకినాడ నుంచి పోటీ చేయవచ్చునని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











