పవన్ పరువు పోయినట్లే అని తేల్చేసారు
హైదరాబాద్ : రాజకీయ, సినీ వర్గాల్లో అందరి దృష్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై ఉంది. ఆయన తన సన్నిహితుడు పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) కి విజయవాడ లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్దిగా ప్రపోజ్ చేసారని, అయితే దాన్ని చంద్రబాబు మన్నించలేదని ఇప్పుడు పవన్ పరువుపోయినట్లే అంటున్నారు ఓ వర్గం. అయితే ఇప్పటికే ఈ విషయమై పవన్ ఓ క్లారిటీ ఇచ్చి ఉన్నాడు. అది తెలుగుదేశం అంతర్గత వ్యవహారం అని తేల్చి చెప్పారు.

కేశినేని నాని విషయంలో తెదేపా అధినేత చంద్రబాబు ముందుగా ఇచ్చిన మాటకు కట్టుబడి విజయవాడ లోక్సభ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. ఎట్టకేలకు వూహాగానాలకు, అనుమానాలకు తెరపడింది. గత ఏడాది జనవరిలో జిల్లాకు చేరిన చంద్రబాబు 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర సమయం నుంచి కేశినేని తెదేపాలో క్రియాశీలకంగా మారారు. లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి.. లోక్సభ పరిధిలోని అన్ని మండలాల్లో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న కేశినేనికి టిక్కెట్టు కేటాయింపు కొద్ది కాలంగా అనుమానంలో పడింది. ఈ స్థానం నుంచి అభ్యర్థిత్వం కోసం పలువురు పోటీపడ్డారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) టిక్కెట్టు కోసం తీవ్రప్రయత్నాలు చివరి నిమిషం వరకు కొనసాగాయి. ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పీవీపీకి టిక్కెట్టు కోసం గట్టిగా ప్రయత్నించారనేది ప్రచారం. ఈ నేపథ్యంలో కేశినేని హైదరాబాద్లో మూడు నాలుగు రోజులుగా తిష్ఠవేసి పలు దఫాలు అధినేతతో భేటీ అయ్యారు. ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయాలనే అధిష్ఠానం ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. ఎట్టకేలకు టిక్కెట్టు దక్కించుకుని బీఫారంతో నగరానికి మంగళవారం రాత్రికి చేరుకున్నారు. బుధవారం ఉదయం నామినేషన్ దాఖలుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాగా బీఫారం చేతికి అందేవరకు ఆయన వర్గీయుల్లో ఆందోళన నెలకొంది. పీవీపీ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారనే సమాచారం ఎప్పటికప్పుడు జిల్లాకు చేరుతుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


Click it and Unblock the Notifications











