Fauji: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్..'ఫౌజీ' రిలీజ్ డేట్ ఫిక్స్..ఎప్పుడో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల మారుతి దర్శకత్వంలో వచ్చిన 'ది రాజా సాబ్' ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో, అభిమానుల దృష్టి ఇప్పుడు పూర్తిగా ఆయన తదుపరి సినిమాలపై పడింది. ఈ నేపథ్యంలో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న *'ఫౌజీ'*పై అంచనాలు మరింత పెరిగాయి. 'రాజాసాబ్' ఫలితం తర్వాత అభిమానుల ఆశలు ఈ సినిమాపైనే నిలిచిపోయాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా విడుదల ఎప్పుడు? అనేది ఫ్యాన్స్లో ఆసక్తితో పాటు కొంత సందేహాన్ని కూడా రేకెత్తిస్తోంది.
డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 'ఫౌజీ'. ఈ సినిమాపై తాజా అప్డేట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ పీరియాడికల్ వార్ డ్రామా విడుదల తేదీపై నెలకొన్న సందేహాలకు తాజాగా క్లారిటీ వచ్చేలా మైత్రీ మూవీ మేకర్స్ సీఈఓ స్పందించడం విశేషం. మొదట ఈ సినిమాని ఆగస్టు లేదా దసరా బరిలోకి తీసుకురావాలని భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని తెలుస్తోంది. షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడం, ముఖ్యంగా భారీ స్థాయిలో ఉండే CGI వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కువ సమయం తీసుకుంటుండటం వల్ల రిలీజ్ ఆలస్యం అవుతోంది.

అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు 80 శాతం పూర్తయ్యిందని, మిగిలిన భాగాన్ని వేగంగా పూర్తి చేసి 2026 చివర్లో విడుదల చేయాలనే టార్గెట్తో మేకర్స్ ముందుకు వెళ్తున్నారు. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. 'సీతా రామం' వంటి క్లాసిక్ తర్వాత హను ఈసారి పూర్తిస్థాయి యుద్ధ నేపథ్యంలో కథను రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఉండే వార్ ఎపిసోడ్స్ విజువల్ వండర్గా నిలుస్తాయని, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 1940ల కాలం నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రభాస్ ఒక సైనికుడిగా కనిపించనున్నారని సమాచారం.
ఇక హీరోయిన్గా సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వీ టాలీవుడ్కు పరిచయం అవుతుండగా, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రభాస్ గ్లోబల్ మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి రాజీ పడకుండా విజువల్ క్వాలిటీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం.
అయితే 'ఫౌజీ' ఆలస్యానికి మరో కారణం కూడా ఉంది. ఇదివరకే ది రాజా సాబ్ (The Raja Saab చిత్రానికి ప్రభాస్ ఎక్కువ సమయం కేటాయించడం వల్ల షెడ్యూల్స్ మారిపోయాయి. ఇప్పుడు ఆ సినిమా పూర్తి కావడంతో, ప్రభాస్ పూర్తిగా 'ఫౌజీ'పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారని టాక్.
ఇదిలా ఉండగా, ఇటీవల సోషల్ మీడియాలో 'ఫౌజీ' లుక్స్ అంటూ కొన్ని ఫోటోలు వైరల్ కావడం కూడా చర్చకు దారితీసింది. అయితే అవి అధికారిక స్టిల్స్ కాదని, ఎవరూ వాటిని షేర్ చేయవద్దని చిత్రబృందం హెచ్చరించింది. అలాంటి లీకులు సైబర్ నేరంగా పరిగణిస్తామని కూడా స్పష్టం చేసింది. ఇలా 'ఫౌజీ'పై ఉన్న అంచనాలు రోజు రోజుకీ పెరుగుతుండగా, ఈ ఏడాది చివర్లో రిలీజ్ అవుతుందన్న సంకేతాలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. 'కల్కి 2898 AD' తర్వాత ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడా? అన్న ఆసక్తి ఇప్పుడు మరింతగా పెరిగింది.


Click it and Unblock the Notifications