రెండు కోట్లకి 'కోకో కోలా' అంటున్న ప్రభాస్
మిగతా హీరోలంతా రకరకాల ప్రొడక్టులను ఎండార్స్ చేసుకుని బ్రాండ్ ఎంబాసిడర్స్ గా మారుతుంటే ప్రభాస్ కు కూడా ఆ కోరిక పుట్టినట్లుంది. కోకా కోలా ప్రొడక్టుకి బ్రాండ్ ఎంబాసిడర్ గా రీసెంట్ గా సైన్ చేసినట్లు సమాచారం. ఇందునిమిత్తం ప్రభాస్ ఫోటో షూట్ లో కూడా పాల్గొన్నట్లు సమాచారం. ముంబైలో జరిగిన ఈ ఫోటో షూట్ లో ప్రభాస్ వివిధ గెటప్ లు వేసి చూసినట్లు చెప్తున్నారు. త్వరలోనే ఈ మేరకు టీవి యాడ్ కోసం షూటింగ్ జరగనుంది. జూలై నెలాఖరు నుంచి కానీ ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి కానీ టీవిలో టెలికాస్ట్ కానుంది. ఇందు నిమిత్తం ప్రభాస్ కి రెండు కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ రెబెల్,వారధి చిత్రాల బిజీలో ఉన్నాడు.
ప్రభాస్ తాజా చిత్రం 'రెబల్'. లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంకి ట్రేడ్ లో మంచి రేట్లు పలుకుతున్నాయి. పవన్,మహేష్,ఎన్టీఆర్,రామ్ చరణ్ చిత్రాల తరహాలో ఈ చిత్రం బిజినెస్ చాలా క్రేజ్ గా జరుగుతోంది. 'రెబల్'లో ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేథ్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. లారెన్స్ మాత్రం ఈ చిత్రం గురించి మీడియాలో ఊదరకొడుతున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ క్యారక్టరైజేషన్ చాలా డిఫెరెంట్ గా ఉంటుందంటున్నారు దర్శకుడు లారెన్స్. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ...మా సినిమా లో హీరో కూర్చుని కబుర్లు చెప్పే రకం కాదు. రంగంలోకి దిగి చేసి చూపిస్తాడు. ఏటికి ఎదురీదడం అతనికిష్టం. పోరాడైనా గెలవడం అతని నైజం. ఇంతకీ అతని లక్ష్యం ఏంటి? అనేది మా చిత్రంలో చూడాల్సిందే అన్నారు.
అలాగే..ప్రభాస్ పాత్రలో అతను నిరంతరం మండే అగ్నిగోళంలాంటివాడు. మిట్టమధ్యాహ్నం సూర్యుడు ఎలా భగభగలాడుతూ కనిపిస్తాడో... అతను అలానే ఉంటాడు. ఆ సెగను ఆపడం ఎవరి తరం కాదు. బుల్లెట్ అయితే ఒక గుండెనే చీల్చుతుంది. అతను మిస్సైల్..ఒక్కసారిగా శత్రు స్థావరాన్ని మట్టుపెట్టేస్తాడు. ఇదంతా ప్రత్యర్థులకే. ప్రేమిస్తే మాత్రం సాయంకాలపు చిరుగాలిలా ఆహ్లాదాన్ని పంచుతాడు. ఇంతకీ అతగాడి కథేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు లారెన్స్.
అలాగే ప్రభాస్ సైతం ఈ చిత్రం పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన ఈ చిత్రం గురించి చెపుతూ..షూటింగ్ టైమ్ లోనే నాకు మంచి కిక్ ఇస్తున్న సినిమా ఇది. లారెన్స్ ఎక్స్ట్రార్డినరీగా తీస్తున్నాడు. నా ఫ్యాన్స్కి నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయి.ఇందులో నా లుక్ డిఫరెంట్గా ఉంటుంది. టైటిల్కి తగ్గట్టుగా స్టైలిష్గా, పక్కా మాస్గా ఉంటుందీ సినిమా అని ప్రభాస్ చెప్తున్నారు. తమన్నా, దీక్షాసేథ్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సి.రాంప్రసాద్, మాటలు: 'డార్లింగ్'స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాణం: బాలాజీ సినీ మీడియా.


Click it and Unblock the Notifications











