పూరి- దేవరకొండ కాంబినేషన్ లో సోషియో ఫాంటసీ.. కెరీర్లో మొదటి సారి సాహసం చేస్తున్న క్రేజీ డైరెక్టర్!
చాలా వేగంగా సినిమాలు చేస్తారని పూరి జగన్నాథ్ కి పేరు ఉండేది. కరోనా కారణంగా ప్రస్తుతం కాస్త వెనకబడ్డాడు కానీ సినిమా ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే పూర్తి చేసి విడుదలకు కూడా సిద్ధం చేస్తాడని ఆయనను అంటూ ఉంటారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయన మరో ప్రాజెక్టు కూడా చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ సోషియో ఫాంటసీ అనే వాదన తెరమీదకు వచ్చింది ఆ వివరాల్లోకి వెళితే..

రంగం సిద్ధం
వరుస డిజాస్టర్ సినిమాలతో ఇబ్బంది పడ్డ పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ సినిమాతో భారీగా లాభాలు అందుకున్న ఆయన అదే ఊపులో విజయ్ దేవరకొండతో లైగర్ అనే సినిమా ప్రకటించారు. కరోనా సమయంలో షూటింగ్ ఆగిపోవడంతో ఈ సినిమా చాలా ఆలస్యమైంది. అన్ని పెద్ద సినిమాలు విడుదల అయిపోయిన నేపథ్యంలో ఈ సినిమాను ఆగస్టు 25వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు.

సెట్స్ పై
కరణ్ జోహార్, చార్మికౌర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను పూరీకనెక్స్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద నిర్మించారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగానే పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో జనగణమన అనే మరో భారీ పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. ప్రస్తుతం జన గణ మన సెట్స్ పై ఉంది. విజయ్ దేవరకొండ కాకుండా మిగతా ఆర్టిస్టులతో షూటింగ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

సోషియో ఫాంటసీ మూవీ
ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఈ రెండు సినిమాలు కాకుండా ముచ్చటగా మూడో సినిమాగా మరో ప్రాజెక్ట్ తెరకెక్కే అవకాశం ఉందని కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిజంగానే విజయ్ దేవరకొండకు పూరీ జగన్నాథ్ స్క్రిప్ట్ చెప్పారని దానికి ఆయన ఓకే కూడా చెప్పారని అంటున్నారు. జనగణమన మూవీ పూర్తయిన తర్వాత ఈ సినిమా ప్రారంభిస్తారని అధికారిక ప్రకటన కూడా అప్పుడే వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకు సోషియో ఫాంటసీ మూవీ అని అంటున్నారు.

జూలై 21వ తేదీన
ఇప్పటివరకు రాజమౌళి యమదొంగ, మగధీర లాంటి సోషల్ సినిమాలు చేశారు. కానీ పూరి జగన్నాథ్ అలాంటి సినిమాలు చేయడం ఇదే మొదటిసారి. మాస్ మసాలా మూవీస్ డైరెక్టర్ గా పేరున్న పూరీ జగన్నాథ్ ఈ సోషియ ఫాంటసీ సబ్జెక్టుని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడవలసి ఉంది. ఇక లైగర్ ట్రైలర్ కూడా ఈ జూలై 21వ తేదీన విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక ప్రొఫెషనల్ బాక్సర్ పాత్రలో నటిస్తున్నాడు.

కీలకపాత్రలో
అనన్య పాండే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, మైక్ టైసన్ వంటి వారు ఇతర కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాతో కచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టడం ఖాయమని అటు విజయ్ దేవరకొండ అభిమానులు ఇటు పూరి జగన్నాధ అభిమానులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











