Coolie: కూలీలో పవన్ కళ్యాణ్ రియల్ ఇన్సిడెంట్? రజనీతో ఆ సీన్.. థియేటర్స్ బ్లాస్టే!
సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కూలీ. సన్పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ దాదాపు రూ.370 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్లు కీలకపాత్ర పోషిస్తుండగా.. బాలీవుడ్ సూపర్స్టార్ అమీర్ఖాన్ గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ దర్శకత్వం వహిస్తుండగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫర్గా వ్యవహరిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 14న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూలీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
కూలీపై భారీ అంచనాలు
తొలిసారిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలైవా నటిస్తుండటంతో ఈ సినిమాపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో కూలీ యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో స్పీడు పెంచింది. దీనిలో భాగంగా చెన్నైలో ఆగస్ట్ 2వ తేదీన కూలీ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కూలీ మూవీ ట్రైలర్ను కూడా విడుదల చేశారు. రజనీ ఇమేజ్కు తోడు అమీర్ ఖాన్, అక్కినేని నాగార్జున, ఉపేంద్ర లాంటి భారీ స్టార్ క్యాస్టింగ్ ఉండటంతో కూలీ హైప్ ఆకాశాన్ని తాకుతోంది. దీనిని ట్రైలర్ మరింత పెంచేసిందని అంటున్నారు విశ్లేషకులు.
ట్రైలర్కు మిక్స్డ్ రెస్పాన్స్
లోకేష్ మార్క్ స్టైలీస్ టేకింగ్.. ఎలివేషన్లతో కూలీ ట్రైలర్ మాస్ను ఊపేస్తోంది. క్యారెక్టర్ల పరిచయానికి ఇందులో పెద్ద పీట వేసినప్పటికీ.. కథ, మెయిన్ థీమ్ ఏంటన్నది చెప్పకపోవడంపై కొందరు పెదవి విరుస్తున్నారు. అయితే కూలీ కథా కమామీషు అంతా డైరెక్ట్గా థియేటర్లోనే చూడాలన్నది లోకేష్ అభిప్రాయమని వాదించే వారు ఉన్నారు. ట్రైలర్లో కథ విప్పకపోవడం ద్వారా మరింత క్యూరియాసిటీని, అంచనాలను పెంచాలన్నది లోకేష్ ఎత్తుగడగా చెబుతున్నారు.

కూలీలో పవన్ కళ్యాణ్ రియల్ ఇన్సిడెంట్?
అయితే ఈ ట్రైలర్లో ఓ చోట కర్చీఫ్లు, కండువాలు పట్టుకుని చుట్టూ జనం ఉండగా వారి మధ్యలో రజనీకాంత్ నడిరోడ్డుపై పడుకుని ఉన్న సీన్ కనిపించింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూస్తుంటే ఈ సీన్ ఎప్పుడో.. ఎక్కడో చూసినట్లుగా ఉందనే కామెంట్స్ వినిపించాయి. పవర్స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇది తమ అభిమాన నటుడి రియల్ లైఫ్ ఇన్సిడెంట్ నుంచి కాపీ కొట్టారంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

నడిరోడ్డుపై పడ్డుకున్న పవన్
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అప్పటి ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని వైఎస్ జగన్ ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ 9న అరెస్ట్ చేసింది. ఆయన అరెస్ట్ .. జాతీయ స్థాయిలో కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరారు. తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఎన్టీఆర్ జిల్లా అనుమంచిపల్లి వద్ద పవన్ కళ్యాణ్ కాన్వాయ్ని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై పవన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏపీలోకి ప్రవేశించడానికి ఎంతకూ పోలీసులు అనుమతించకపోవడంతో నడిరోడ్డుపైనే పడుకున్నారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా.. పార్టీ శ్రేణులతో కలిసి కాలినడకన విజయవాడకు బయల్దేరారు.
ఏపీ రాజకీయాలనే మార్చేసిన రాత్రి
ఈ వ్యవహారంతో తీవ్ర అసంతృప్తికి గురైన పవన్ కళ్యాణ్ .. జగన్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ పరిణామాలతో 2024 ఎన్నికల్లో టీడీపీతో జనసేన కలిసి నడుస్తుందని సంచలన ప్రకటన చేశారు పవన్. ఆ తర్వాత బీజేపీని కూడా కూటమిలోకి తీసుకొచ్చి, తనకు పొత్తులో భాగంగా కేటాయించిన సీట్లను కూడా త్యాగం చేసి కూటమి అభ్యర్ధుల విజయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు పవన్ కళ్యాణ్. నాటి ఎన్నికల్లో కూటమి భారీ విజయంతో ఏపీలో అధికారంలోకి రావడంతో పాటు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. పవన్ కళ్యాణ్ను జగన్ ప్రభుత్వం అడ్డుకున్న ఆ రాత్రి ఏపీ రాజకీయాలే మారిపోయాయని విశ్లేషకులు చెబుతారు. ఇప్పుడు కూలీలోనూ రజనీకాంత్ రోడ్డుపై పడుకునే సీన్ ఉండటంతో థియేటర్లు దద్ధరిల్లిపోతాయని అభిమానులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











