రజనీ రూ. 240 కోట్ల ప్రాజెక్టులో రామ్ చరణ్?
చెన్నై: సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఫిల్మ్ సర్కిల్లో ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. సన్ పిక్చర్స్ సంస్థ మాజీ డిప్యూటీ డైరెక్టర్ అయిన హాన్స్ రాజ్ సక్సేనా రజనీకాంత్తో రూ. 240 కోట్ల భారీ ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తున్నారని, ఇందులో మెగా పవర్ రామ్ చరణ్ కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారని ఆ వార్తల సారాంశం. సాక్స్ పిక్చర్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మించనున్నారట. అయితే ఈవిషయమై ఇప్పటి వరకు హాన్స్ రాజ్ నుంచి గానీ ఇతరుల నుంచి గానీ ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.
ఆ సంగతి పక్కన పెడితే...ప్రస్తుతం రజనీకాంత్ 'కొచ్చాడయాన్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రజనీకాంత్..రణధీరన్ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ కెమెరా వర్క్ అందిస్తున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది.
దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తెలుగులోనూ ఈచిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం రజనీకాంత్ పుట్టిన రోజును పురస్కరించుకుని 12.12.12న విడుదలవుతోంది.
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం రామ్ చరణ్ 'నాయక్' చిత్రంలో నటిస్తున్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో చెర్రీ డ్యూయల్ రోల్ చేస్తుండగా....అతని సరసన సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ నటిస్తున్నారు. 'నాయక్' షూటింగ్ ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక్కడ సినిమాకు సంబంధించిన కీలకమైన ఫైటింగ్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. రామ్ చరణ్ ఈచిత్రంతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంలో, బాలీవుడ్లో 'జంజీర్' చిత్రంలో కూడా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











