రామ్ చరణ్ మూవీ: కృష్ణ వంశీపై చిరంజీవి సీరియస్?
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. జ్వరం కారణంగా షూటింగులో పాల్గొన బోతున్నానని, అందుకే కొన్ని రోజులు షూటింగుకు బ్రేక్ ఇస్తున్నట్లు రామ్ చరణ్ ఇటీవల తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా వెల్లడించారు.
అయితే ఫిల్మ్ నగర్లో మాత్రం సినిమా ఆగిపోవడానికి మరో కారణం వినిపిస్తోంది. ఈ సినిమా దర్శకుడు కృష్ణవంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విధానం చిరంజీవికి నచ్చకపోవడం వల్లే విరామం ఇచ్చారని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. చరణ్ ఇమేజ్కు తగిన విధంగా సినిమా లేదంటూ కృష్ణ వంశీపై సీరియస్ అయ్యాడట. కొన్ని సీన్లు మార్చమంటూ సూచనలు ఇచ్చి రీషూట్ చేయమని చెప్పినట్లు చెప్పుకుంటున్నారు.

పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మాణంలో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుటుంబకథా చిత్రం "గోవిందుడు అందరివాడేలే". ఈ సినిమాలో రామ్ చరణ్, శ్రీకాంత్, కాజల్ అగర్వాల్, కమలినీ ముఖర్జీ, రాజ్ కిరణ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సొంతగడ్డపై అడుగుపెట్టిన ప్రవాస భారతీయుడిగా పోనీ టెయిల్తో కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్ర యూనిట్ కన్యాకుమారి, పొలాచ్చి షెడ్యూల్స్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరింది. ప్రస్తుతం హైదరాబాద్లో సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











