అదే రోజు ఫ్యాన్స్తో చరణ్, బాబాయ్ మీటింగుకు గండి?
హైదరాబాద్: ఓ వైపు అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో మంచి హోదాలో కొనసాగుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్.....'కాంగ్రెస్ హటావ్...దేశ్ బచావ్' నినాదంతో కొత్త పార్టీ స్థాపించడం హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామాలతో పవన్ కళ్యాణ్ ఒక వైపు, మిగతా మెగా ఫ్యామిలీ హీరోలంతా మరో వైపు చీలి పోయారు.
పవన్ కళ్యాణ్ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని, తమతో పాటు, మెగా అభిమానులంతా చిరంజీవి వైపే అని రామ్ చరణ్ తో పాటు నాగబాబు మీడియా ముఖంగా ప్రకటించారు. ఈ పరిణామాలతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానుల మధ్య కూడా చీలిక ఏర్పడిందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

కాగా...ఈ నెల 27న పవన్ కళ్యాణ్ వైజాగ్లో 'జన సేన' పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసారు. ఈ సభకు భారీగా మెగా అభిమానులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇదేరోజు రామ్ చరణ్ తన అభిమానులతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ విషయమై మీటింగు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
దీంతో రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. బాబాయ్ పవన్ కళ్యాణ్ వైజాగ్ మీటింగు అదే రోజు ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ మీటింగుకు గండి పడే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా.....పవన్ కళ్యాణ్ సభ పెట్టిన రోజు రామ్ చరణ్ ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయింది.
అయితే కొందరు అభిమానులు మాత్రం ఈ వాదనను ఖండిస్తున్నారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు, ప్రతి సంవత్సరం అభిమానులు ఈ రోజు రామ్ చరణ్ను కలిసి విషెస్ చెప్పడం, రక్తదానం చేయడం ఆనవాయితీగా వస్తోందని అంటున్నారు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ వైజాగ్ సభను ఉద్దేశించి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం లేదని అంటున్నారు. ఇదే రోజు రామ్ చరణ్, కృష్ణ వంశీ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేస్తారట.


Click it and Unblock the Notifications











