Peddi Pre Release Event: రామ్ చరణ్ కోసం ఆ స్టార్ క్రికెటర్? పెద్ది మేకర్స్ మాస్టర్ ప్లాన్..
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న మూవీ పెద్ది. ఈ ప్రాజెక్ట్పై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్నో వాయిదాల తర్వాత జూన్ 4న ఈ సినిమా వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఎవరూ ఊహించని వ్యక్తిని తీసుకురానున్నారట. ఈ వివరాల్లోకి వెళితే..
పెద్దిలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించనున్నారు. కన్నడ సూపర్స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, దివ్యెందు శర్మ, విజి చంద్రశేఖర్ తదితరులు పెద్ది మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ది సినిమాస్, ఐవీవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై కిలారు వెంకట సతీష్, ఇషాన్ సక్సేనాలు పెద్ది సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత, మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు కెమెరామెన్గా, నవీన్ నూలీ ఎడిటర్గా సేవలందిస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫి అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్లు సమర్పిస్తున్నాయి.

ఎప్పుడో పూర్తి కావాల్సిన పెద్ది సినిమా.. అనివార్య కారణాలతో వాయిదా పడింది. ప్రధానంగా ఐటెం సాంగ్తో పాటు కొంత షూటింగ్ మిగిలి ఉండటమే ఈ ఆలస్యానికి కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సాంగ్ కోసం మృణాల్ ఠాకూర్, సంయుక్త మీనన్, పూజా హెగ్డే వంటి పేర్లు వినిపించినప్పటికీ చివరికి శృతి హాసన్కు అవకాశం దక్కింది. వీరిద్దరిపై షూట్ చేసిన సాంగ్ మాస్ను ఊపేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్లో ప్రస్తుతం యూనిట్ మొత్తం బిజీగా ఉంది.
జూన్ 4న రిలీజ్ నేపథ్యంలో పెద్దిపై హైప్ను పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగా జూన్ 2వ తేదీ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని వార్తలు వస్తున్నాయి. పెద్ది కథకు తగిన విధంగా స్టేజ్ను సిద్దం చేస్తున్నారట. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున మెగా అభిమానులు తరలివస్తారని భావిస్తున్నారు. తాజాగా పెద్ది గురించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఆర్ఆర్ఆర్తో గ్లోబల్ స్టార్ ఇమేజ్ను పొందిన రామ్ చరణ్కు నార్త్ ఇండియాలోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దాంతో పెద్దిని తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ భారీగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముందు నార్త్ ఇండియాలోనూ ఏదో ఒక ఈవెంట్ నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బీహార్లో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించడం హిందీ బెల్ట్లో అల్లు అర్జున్ మూవీకి బాగా కలిసొచ్చింది. ఇప్పుడే ఇదే సూత్రాన్ని ఫాలో అవ్వాలని పెద్ది యూనిట్ ఆలోచిస్తోందట.
దీనిలో భాగంగానే జార్ఖండ్ రాజధాని రాంచీలో భారీ ఈవెంట్ నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీని ఆహ్వానించాలని భావిస్తున్నారట. పెద్దిలో క్రికెట్ నేపథ్యం ఉన్న కారణంగా ధోనీ ఛరిష్మా దీనికి ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. రాంచీలో పెద్ది ఈవెంట్ జరిగి, ధోనీ కనుక హాజరైతే.. పెద్దికి నార్త్ ఇండియాలో ఓ రేంజ్లో హైప్ వస్తుంది. ప్రస్తుతానికి ధోనీని ఈవెంట్కి తీసుకొచ్చేందుకు నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications



