PEDDI OTT: పెద్ది ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్? ఓటీటీలో కొత్త రికార్డులపై కన్నేసిన మేకర్స్!
Ram Charan's Peddi OTT: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్తో దూసుకెళ్తోంది. చాలా కాలంగా భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ పెద్ది రూపంలో బిగ్ సక్సెస్ అందుకుంది. తెలుగు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ పొందుతోంది. ఇంకా 'పెద్ది'మేనియా కొనసాగుతుండగానే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి, సోషల్ మీడియాలో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. ఇంతకీ ఈ విషయమేంటీ?
పెద్ది కలెక్షన్ల విషయానికి వస్తే బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైన తొలి రోజు నుంచే భారీ స్పందనను అందుకుంది. ప్రీమియర్ షోలు, ఫస్ట్ డే వసూళ్లతో కలిపి రూ.135 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అలాగే, కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.332 కోట్ల గ్రాస్ మార్క్ను అందుకుంది. తాజాగా మొదటి వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.345 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసినట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. రామ్ చరణ్ కెరీర్లో అత్యంత భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఇదిలా ఉంటే.. పెద్ది డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం నెట్ఫ్లిక్స్ దాదాపు రూ.105 కోట్ల వరకు వెచ్చినట్టు వార్త ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ భారీ డీల్ వెనుక కేవలం రామ్ చరణ్ స్టార్డమ్ మాత్రమే కాకుండా, ఓటీటీ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్న "ఎక్స్టెండెడ్ అన్కట్ వెర్షన్" కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. థియేటర్లలో రన్టైమ్ పరిమితుల కారణంగా కొన్ని సన్నివేశాలను తొలగించిన విషయం తెలిసిందే. అయితే.. ఓటీటీలో తిరిగి జోడించి, ప్రేక్షకులకు పూర్తి అనుభూతిని అందించాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
థియేటర్లలో కట్ అయిన సీన్లు తిరిగి వస్తాయా?
పెద్ది విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రధాన విమర్శల్లో ఒకటి ఎడిటింగ్. కొన్ని సన్నివేశాలు అకస్మాత్తుగా ముగియడం, కొన్ని పాత్రల ఆర్క్లు పూర్తి స్థాయిలో కనిపించకపోవడం వంటి అంశాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముఖ్యంగా సీనియర్ నటుడు జగపతి బాబు పోషించిన పాత్రకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలు నిడివి కారణంగా తొలగించబడ్డాయని ప్రచారం జరిగింది. అలాగే రావు రమేష్, జగపతి బాబు పాత్రల మధ్య జరిగే రాజకీయ, మానసిక పోరాట సన్నివేశాలు కూడా థియేట్రికల్ వెర్షన్లో పూర్తి స్థాయిలో కనిపించలేదని అభిమానులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఓటీటీ వెర్షన్లో ఈ సన్నివేశాలను తిరిగి జోడించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
జాన్వీ కపూర్ పాత్రకు కొత్త ప్రాధాన్యత?
సినిమా విడుదలైన తొలి వారంలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన "అచ్చియమ్మ" పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో వివాదాలకు దారితీశాయి. విమర్శలు, ట్రోలింగ్ నేపథ్యంలో కొన్ని భాగాలను చిత్ర యూనిట్ తొలగించింది. అయితే కథా పరంగా ఆ పాత్రకు మరింత బలం చేకూర్చే కొన్ని భావోద్వేగ సన్నివేశాలు కూడా అదే సమయంలో కట్ అయ్యాయని సమాచారం. దీంతో ఓటీటీ వెర్షన్లో అచ్చియమ్మ పాత్రకు సంబంధించిన పూర్తి ట్రాక్ను చూపించే అవకాశం ఉందనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఒకవేళ ఇది నిజమైతే థియేటర్లలో చూసిన ప్రేక్షకులకు కూడా కొత్త అనుభూతి కలిగించే అవకాశం ఉంది.
నెట్ఫ్లిక్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ సంస్థల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఒక సినిమా విడుదలైన వెంటనే కోట్లాది మంది ప్రేక్షకులను తమ ప్లాట్ఫామ్కు ఆకర్షించడం కోసం ప్రత్యేక కంటెంట్ అవసరం. ఈ నేపథ్యంలోనే నెట్ఫ్లిక్స్ గతంలో కొన్ని పెద్ద సినిమాల విషయంలో "ఎక్స్టెండెడ్ కట్" లేదా "డైరెక్టర్స్ కట్" స్ట్రాటజీని అనుసరించింది. థియేటర్లలో ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు కూడా కొత్త సన్నివేశాలు ఉన్నాయని తెలిస్తే మళ్లీ ఓటీటీలో చూసే అవకాశం ఉంటుంది. ఈ సినిమాతో ఓటీటీలోనూ నయా రికార్డులు క్రియేట్ చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. కొత్త సన్నివేశాలను జోడించాలంటే, రీఎడిట్ చేసిన వెర్షన్కు మరోసారి సెన్సార్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications




