డెబ్యూ మూవీకే జాక్పాట్... శ్రీనివాసమంగాపురంకు రషా తడానీకి పారితోషికం ఎంతంటే?
ప్రొడక్షన్ కాస్ట్, బడ్జెట్ వ్యయాలు పెరిగిపోతున్నాయని హీరోలు, హీరోయిన్లు తమ రెమ్యునరేషన్లను తగ్గించుకోవాలని ఓ పక్క నిర్మాతలు, సినీ పెద్దలు కోరుకుంటున్నా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఒకరిద్దరు తప్పించి భారీ పారితోషికాలతో హీరోలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఇక కొత్తగా వచ్చే ముద్దుగుమ్మలు కూడా భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ అగ్రనటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ హీరోయిన్గా తన తొలి తెలుగు చిత్రానికే రికార్డ్ పారితోషికం అందుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ఆయన కుమారులు రమేశ్ బాబు, మహేశ్ బాబు, కుమార్తె మంజులతో పాటు అల్లుడు సుధీర్ బాబులు వెండితెరపై సత్తా చాటారు. ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మూడో తరం కూడా సినీరంగ ప్రవేశం చేస్తోంది. కృష్ణ పెద్దకుమారుడు రమేశ్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఎప్పటి నుంచో కథనాలు వస్తుండగా స్క్రిప్ట్ ఎంపిక, దర్శకుడు ఎవరు? అనే దానిపై తర్జన భర్జనల అనంతరం శ్రీనివాస మంగాపురంతో జయకృష్ణ అరంగేట్రం సెట్ అయ్యింది. ఈ కుర్రాడి సినిమా లాంచింగ్కు సంబంధించి ఘట్టమనేని ఫ్యామిలీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

చివరికి దర్శకుడిగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఇక ఘట్టమనేని వారసుడికి హీరోయిన్ ఎవరన్న దానిపైనా అనేక చర్చలు జరిగాయి. తెరపైకి పలువురు ముద్దుగుమ్మల పేర్లు వచ్చాయి. చివరికి అలనాటి బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ ఎంపికైంది. గతేడాది జనవరిలో విడుదలైన హిందీ చిత్రం ఆజాద్తో ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో బాలీవుడ్ సూపర్స్టార్ అజయ్ దేవగణ్ కుమారుడు అమన్ దేవగణ్ హీరో కావడం గమనార్హం. ప్రస్తుతం హిందీ భామలంతా టాలీవుడ్ బాడపట్టడంతో తన కుమార్తెను కూడా తెలుగు చిత్ర పరిశ్రమ ద్వారా మరింత వృద్దిలోకి తీసుకురావాలని భావించిన రవీనా టాండన్ వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రషా టాలీవుడ్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
శ్రీనివాస మంగాపురంతో ఇద్దరు వారసులను టాలీవుడ్కు పరిచయం చేసే బాధ్యతను అజయ్ భూపతి తన భుజాలకెత్తుకున్నారు. కథ, టేకింగ్ విషయంలో ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లలో జయకృష్ణ, రషా తడానీ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందని.. ఇద్దరూ చాలా బాగా నటించారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్పై జెమినీ కిరణ్ ఈ శ్రీనివాస మంగాపురం సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్బాబు, నరేష్, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రాఫర్గా, మహదేవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తొలుత జూలై 9న శ్రీనివాస మంగాపురం మూవీ విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ మర్నాడే అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ విడుదల కానుండటంతో రెండు చిత్రాలను దృష్టిలో పెట్టుకుని శ్రీనివాస మంగాపురంను జూలై 20కి వాయిదా వేశారు.
ఇదిలాఉండగా.. శ్రీనివాస మంగాపురం కోసం రషా తడానీ రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఓ దిగ్గజ బ్యానర్ ద్వారా తన అరంగేట్రం జరుగుతుండటంతో ఘట్టమనేని జయకృష్ణ ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండానే ఈ సినిమాలో నటిస్తున్నాడు. అయితే రషా తడానీకి మాత్రం భారీ స్థాయిలో పారితోషికం ముట్టినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ.. తన తొలి తెలుగు డెబ్యూ మూవీకిగాను ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నట్లుగా తెలుస్తోంది.
బాలీవుడ్లో కేవలం ఒకే ఒక్క సినిమా చేసిన రషా తడానీకి టాలీవుడ్లో ఎంట్రీలోనే ఈ స్థాయి పారితోషికం అందడం సాధారణ విషయం కాదని ఫిలింనగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ప్రతిభావంతులైన తెలుగు అమ్మాయిలు ఎంతోమంది ఉండగా.. ముంబై నుంచి ఓ నటి కూతురిని తీసుకొచ్చి, వారికి ఇంత మొత్తాలను ఎందుకు ఇస్తున్నారంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం రవీనా టాండన్ కుమార్తె కావడం, ఆమెకు బాలీవుడ్లో ఉన్న క్రేజ్, ఆకర్షణ నేపథ్యంలో రషా తడానీకి ఆ స్థాయి పారితోషికం సరైనదేనని చెబుతున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications




