‘ఆచార్య’లో రామ్ చరణ్ జోడీగా కన్నడ బ్యూటీ: ఈ సారి ఆమె పార్ట్ కూడా
మెగాస్టార్ చిరంజీవి - బడా డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం 'ఆచార్య'. కొణెదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయిక. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. దేవాదాయ భూముల ఆక్రమణలపై పోరాడే వ్యక్తి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పని చేసే ఉద్యోగిగా, నక్సలైట్గా రెండు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నారు చిరంజీవి. ఆ మధ్య ఆయన లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. దాదాపు ముప్పై నిమిషాల పాటు ఉండే అతడి పాత్ర సినిమాను మలుపు తిప్పుతుందని అంటున్నారు. అతడు కూడా నక్సలైట్ పాత్రను చేస్తున్నాడని.. ఓ మిషన్లో భాగంగా అతడు చనిపోతే.. చిరంజీవి దాన్ని కొనసాగిస్తాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, చరణ్ పాత్రకు జోడీగా ఓ హీరోయిన్ రోల్ కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అందుకోసం రష్మిక మందన్నాను తీసుకుంటున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. తాజా షెడ్యూల్లో రామ్ చరణ్ పార్ట్ను చిత్రీకరించబోతున్నారట. అంతేకాదు, ఇందులో అతడి జోడీగా నటిస్తున్న రష్మిక మందన్నాకు సంబంధించిన సీన్స్ కూడా షూట్ చేయబోతున్నారని తెలిసింది. అందుకోసం ఆమె త్వరలోనే చిత్ర యూనిట్తో కలవబోతుందని అంటున్నారు. కొద్ది సేపే కనిపించినా ఆమె పాత్ర కూడా ఆకట్టుకునేలా ఉంటుందట. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో అరవింద స్వామి విలన్గా నటిస్తున్నాడని ఇటీవల ఓ న్యూస్ బయటకు వచ్చిన విషయం విధితమే.


Click it and Unblock the Notifications











