Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'విశ్వరూపం' వివాదం వెనక అసలు కుట్ర
చెన్నై : ఇప్పుడు ఎక్కడ విన్నా,మాట్లాడినా 'విశ్వరూపం' విడుదల ఆపు చేయటం గురించే చర్చ. నిజంగానే ముస్లింలుకు వ్యతిరేకంగా ఉందని సినిమా ఆగిందా లేక వేరే కారణాలు ఉన్నాయా...అంటే వేరే రాజకీయ కారణాలు ఉన్నాయని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని తమిళ మీడియా అంటోంది. తమిళనాట సినీ రాజకీయాలకు కమల్హాసన్ బలైపోయారు అంటున్నాయి పరిశ్రమ వర్గాలు.
దాదాపు వందకోట్ల భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన తన చిత్రాన్ని వెండితెర కంటే ముందు డీటీహెచ్లో విడుదల చేయాలని తొలుత కమల్హాసన్ భావించారు. ఇక్కడినుంచే సమస్యలు మొదలయ్యాయి. ఈ నిర్ణయాన్ని తమిళనాడులోని థియేటర్ల యాజమాన్య సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వారి లాబీయింగ్ ఫలితంగా.. కమల్ ఆ ప్రయత్నాన్ని విరమించుకుని నేరుగా థియేటర్లలోనే విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.
కానీ సినిమా విడుదల కావడానికి కొద్దిరోజుల ముందు కొన్ని ముస్లిం సంస్థలు ఆందోళనలు చేశాయి. వెంటనే తమిళనాడు ప్రభుత్వం స్పందించి.. చిత్రం విడుదలపై 15 రోజుల నిషేధం విధించింది. తమిళ సినీ పరిశ్రమకు.. అక్కడి రాజకీయాలకు విడదీయలేని అనుబంధం ఉంది. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలిత ఇద్దరూ సినీ పరిశ్రమ నుంచి వచ్చినవారే. పైకి మతం పేరు చెబుతున్నా.. వాస్తవానికి శాటిలైట్ హక్కుల కోసం జరిగిన పోరాటంలో కమల్ను బలిపశువు చేశారని, ఇందులో పెద్ద రాజకీయ కుట్ర ఉందని తెలుస్తోంది.
అన్నాడీఎంకేకు చెందిన టీవీ చానల్ ఈ హక్కులను కొనుగోలు చేయాలని భావించింది. కానీ అందుకు కమల్ అంగీకరించలేదు. అందుకే నిషేధం విధించారని అంటున్నారు. దాదాపు యాభయ్యేళ్లుగా తమిళనాడు రాజకీయాలను సినీపరిశ్రమే శాసిస్తోంది. సినీనటులు, నిర్మాతలు అంతా ఏదో ఒక పార్టీ వెంట ఉన్నారు. ఎటూ మొగ్గకుండా ఒంటరిగా ఉండిపోవడమే కమల్ చేసుకున్న పాపమని కొందరు చెబుతున్నారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం ఓట్లను రాబట్టుకోవడానికే కమలహాసన్ తాజా చిత్రం విశ్వరూపంపై కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నట్టుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అభ్యంతర సన్నివేశాలు ఉన్నట్టుగా ముస్లిం సంఘాలు ఆందోళన చేపట్టిన కొద్ది గంటల వ్యవధిలో నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై కమలహాసన్ హైకోర్టును ఆశ్రయించగా మంగళవారం సాయంత్రం కమల్కి అనుకూలంగా ఏకసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. దీన్ని ద్విసభ్య ధర్మాసనానికి అప్పీలు చేస్తామని స్పష్టం చేసి ప్రభుత్వం అన్నట్టుగా బుధవారం అప్పీలు చేసి ఏకసభ్య ధర్మాసన తీర్పుపై 'స్టే' తెచ్చుకుంది. ఇటువంటి కఠిన వైఖరి ద్వారా సంబంధిత వర్గాల మనోభావాలను తమ ప్రభుత్వం గౌరవించినట్టు పార్టీ భావిస్తోంది.
మైనారిటీ వర్గాలు మొదటి నుంచి డీఎంకే పార్టీకి అనుకూలంగా ఉంటారన్న ముద్ర ఉంది. దీన్ని ఛేదించి రాష్ట్రంలో కీలకంగా ఉన్న 7.1 శాతం ముస్లిం ఓట్లను సాధించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 39 లోక్సభ నియోజకవర్గాల్లో వేలూర్, రామనాధపురం, నాగపట్నం, సెంట్రల్ చెన్నై, తెన్కాశి, తిరునెల్వేలి వంటి ఆరు స్థానాల్లో ముస్లింల ప్రభావం చూపగల స్థితిలో ఉన్నారు. వారి తీర్పుపైన అక్కడ అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం స్థానాలు కైవసం చేసుకోవాలని భావిస్తున్న జయలలిత వ్యూహంలో భాగంగా లోక్సభ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలతో ఎటువంటి పొత్తు పెట్టుకోబోమని ప్రకటించారు.