రూ. 30 కోట్లు... 40 రోజులు... పవన్ కళ్యాణ్ గురించి హాట్ న్యూస్!
Recommended Video
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలేసి పూర్తి ఫోకస్ రాజకీయాల మీద పెట్టిన సంగతి తెలిసిందే. గతేడాది విడుదలైన 'అజ్ఞాతవాసి' తర్వాత ఆయన ఏ మూవీకి కమిట్మెంట్ ఇవ్వలేదు. తనకు సినిమాలు చేసే సమయం లేదని, సినిమాల కన్నా ప్రజాసేవే ముఖ్యమని, ఇక సినిమాలు చేయకపోవచ్చని ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు.
గతంలో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన మళ్లీ సినిమాల వైపు వస్తారనే అనుమానం అందరిలో కలిగేలా చేసింది. తనకు సినిమాలు తప్ప ఏ పని చేతకాదు.. ఇతర పార్టీల నాయకుల్లాగా కాంట్రాక్టులు, వ్యాపారాలు లేవు, తన జీవనాధారం సినిమాలు మాత్రమే అని చెప్పడమే ఇందుకు కారణం. ఇపుడు ఏపీలో ఎన్నికలు ముగియడంతో మళ్లీ పవన్ కళ్యాణ్ సినిమా రీ ఎంట్రీ అంశం ఇంటస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

అభిమానుల్లో ఆశలు రేపుతున్న వార్త
తాజాగా ఫిల్మ్ నగర్లో పవన్ కళ్యాణ్ గురించి ఓ ఆసక్తికర వార్త ప్రచారంలోకి రావడం అభిమానుల్లో ఆశలు రేపుతోంది. పవర్ స్టార్ త్వరలో సినిమా చేయబోతున్నారని, 2019 చివరకల్లా ఇది ప్రారంభం కాబోతోందని, దీనిక కోసం ప్రత్యేకంగా కొంత సమయం కేటాయించాలని పవన్ స్టార్ నిర్ణయించుకున్నట్లు టాక్.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో
ప్రముఖ తెలుగు సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్తో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు గతంలోనే ప్లాన్ చేసుకుంది. పవన్ కళ్యాణ్ నుంచి కమిట్మెంట్ తీసుకున్నారని, అప్పట్లో అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే రాజకీయాలతో బిజీ కావడం వల్ల పవన్ కళ్యాణ్ ఈ చిత్రం చేయలేక పోయారట.

రూ. 30 కోట్ల రెమ్యూనరేషన్
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్గా ప్లాన్ చేయబోతోందని, ఇందుకోసం పవర్ స్టార్కు దాదాపు రూ. 30 కోట్ల రెమ్యూనరేసన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభించేందుకు తెర వెనక ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఇంకా ఎలాంటి అఫీషియల్ సమాచారం రాలేదు.

ఎన్నికల వేడి తగ్గిన తర్వాతేనా?
ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు ముగిశాయి కానీ రాజకీయ వేడి తగ్గలేదు. అందరూ మే 23న వెలువడే ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఫలితాల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాడే వరకు రెండు మూడు నెలల పాటు ఇదే హడావుడి ఉంటుంది. పొలిటికల్ హీట్ తగ్గిన తర్వాత వీలు చూసుకుని పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

40 రోజుల్లో షూటింగ్ ఫినిష్ చేసేలా
40 రోజుల డేట్స్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ అంగీకరించాడని... ఈ గడువులో పక్కా ప్లానింగ్ ప్రకారం సినిమా పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. అయితే ఈ ప్రాజెక్టుకు దర్శకుడు ఎవరు? ఎలాంటి కథతో ఈ చిత్రం రాబోతోంది లాంటి అంశాలేవీ ఇంకా బయకు రాలేదు. మైత్రి మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్ సమాచారం వస్తే తప్ప ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.


Click it and Unblock the Notifications











