8 ఏళ్ల తర్వాత స్టార్ హీరోతో సాయిపల్లవి రొమాన్స్.. ఎవరూ ఊహించని పాత్రలో నేచురల్ బ్యూటీ !
స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు పేరు వినగానే ప్రేక్షకులకు గుర్తొచ్చేది సహజమైన నటన, భావోద్వేగాలతో నిండిన పాత్రలు, పక్కింటి అమ్మాయి ఇమేజ్. కెరీర్ ప్రారంభం నుంచి ఓ పద్దతి ప్రకారం.. గ్లామర్ రోల్స్ కాకుండా నటనకే ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకమైన పాత్రలను ఎంచుకుంటుంది. ఇప్పుడు తన కెరీర్లోనే అత్యంత భిన్నమైన పాత్రకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దాదాపు 8 ఏళ్ల తరువాత ఆ స్టార్ హీరోతో నటించబోతుందట. ఇంతకీ ఆ సినిమా ఏంటీ? ఆ స్టార్ హీరో ఎవరు?
ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. తమిళ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'D55'(వర్కింగ్ టైటిల్) సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతుందట. ఇప్పటికే 'ఏక్ దిన్'సినిమాలో ప్రేమికురాలి పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి, త్వరలో భారీ పౌరాణిక చిత్రం 'రామాయణం'లో సీత పాత్రలో కనిపించబోతోంది. ఈ రెండు పాత్రలు పూర్తిగా భావోద్వేగాలకు సంబంధించినవి కాగా, ధనుష్ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ అధికారిణి పాత్రలో కనిపించబోతుందట. ఖాకీ డ్రెస్లో యాక్షన్ మోడ్లో అదరకొట్టబోతుందని కోలీవుడ్ టాక్. ముఖ్యంగా నేరస్థులను వెంటాడే ధైర్యవంతమైన పోలీస్ ఆఫీసర్గా ఆమె కనిపించనున్నట్లు తెలుస్తుండటంతో ఈ పాత్రపై భారీ ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రాన్ని 'అమరన్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు రాజ్కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్లో ధనుష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సమాజం కోసం పోరాడే అనామక వీరుల కథను దర్శకుడు తెరపై ఆవిష్కరించబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సాయి పల్లవి పాత్ర కూడా కథలో అత్యంత కీలకంగా ఉండనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ శ్రీలీల. ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా దూసుకుపోతున్న శ్రీలీల కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఒకవైపు నటనతో మెప్పించే సాయి పల్లవి, మరోవైపు ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్తో అలరించే శ్రీలీల, అలాగే విభిన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన ధనుష్ ఒకే సినిమాలో కనిపించనుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. అలాగే ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. గ్రే షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్పై దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
దాదాపు 8 ఏండ్ల క్రితం ధనుష్, సాయి పల్లవి కలిసి 'మారి 2'లో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా 'రౌడీ బేబీ' పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు మళ్లీ ఈ జంట కలిసి నటిస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. అలాగే 'అమరన్' తర్వాత దర్శకుడు రాజ్కుమార్ పెరియసామి, సాయి పల్లవి కలిసి చేస్తున్న రెండో సినిమా కావడం కూడా ప్రత్యేకతగా మారింది.
వండర్బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ స్వరాలు సమకూరుస్తుండగా, సాంకేతికంగా కూడా ఈ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుండగా, ఈ ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. అధికారికంగా సాయి పల్లవి పాత్రపై ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఆమె పోలీస్ పాత్రపై వార్త మాత్రం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారింది.


Click it and Unblock the Notifications




