నిజమా? జేమ్స్ బాండ్ సినిమాలో సానియా మీర్జా!
హైదరాబాద్: టెన్నిస్టార్, హైదరాబాద్ బ్యూటీ సానియా మీర్జా గురించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. సానియా మీర్జాకు హాలీవుడ్ జేమ్స్ బాండ్ సిరీస్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందట. ఇటీవలే ఆమెను నిర్మాతలు సంప్రదించినట్లు చెబుతున్నారు. సినిమాలో కొంత భాగం చిత్రీకరణ ఇండియాలో జరుగనుందని, అందులో ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ అవసరం ఉందని, అందుకోసం ఆమెను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తేలాల్సి ఉంది.
చివరి జేమ్స్ బాండ్ మూవీ ‘స్కై ఫాల్' 2012లో విడుదలైంది. ఇది జేమ్స్ బాండ్ సీరిస్ లో వచ్చిన 23వ సినిమా. ఇక 24వ జేమ్స్ బాండ్ సినిమా షూటింగ్ డిసెంబర్ 6న మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. లండన్ లోని పినెవుడ్ స్టూడిమోస్ సమీపంలో ఈ షూటింగ్ జరుగనుంది.

‘స్కై ఫాల్' చిత్రానికి దర్శకత్వం వహించిన సామ్ మెండెస్ మరోసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నారు. కాసినో రాయల్(2006), క్వాంటమ్ ఆఫ్ సోలెస్(2008) , స్కైఫాల్(2012) చిత్రాల్లో నటించిన డేనియల్ క్రెగ్ నాలుగోసారి 007 ఏజెంట్ పాత్రలో నటించబోతున్నాడు.
గత జేమ్స్ బాండ్ చిత్రాల్లో నటించిన ముఖ్య తారాగణం రాల్ఫ్ ఫిన్నెస్ ‘ఎం' పాత్రలో, నియోమీ హారిస్ ‘ఈవ్ మనీపెన్నీ', బెన్ వైషా ‘క్యూ' పాత్రల్లో నటించబోతున్నారు. ఇతర తారాగణం వివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. స్కైఫాల్ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించిన జాన్ లోగన్, నీల్ పర్విస్, రాబర్ట్ వాడ్ పని చేయబోతున్నారు.
2015 ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. బ్రిటన్లో అక్టోబర్ 23, 2015న, అమెరికాలో నవంబర్ 6, 2015న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత జేమ్స్ బాండ్ చిత్రం ‘స్కై ఫాల్' ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. ఈసారి వసూళ్లు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











