విజయశాంతి ఒక్కరే కాదు ఇంకొక్కరు కూడా.. మహేష్ 26 ఇంట్రెస్టింగ్ అప్డేట్
''భరత్ అనే నేను, మహర్షి'' లాంటి వరుస సక్సెస్ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఇటీవలే 'ఎఫ్ 2' సినిమాతో సంక్రాంతి సక్సెస్ సాధించిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న ఈ సినిమా అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా కథ, కథనం, నటీనటుల విషయంలో రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వినిపిస్తున్న ఓ వార్త మహేష్ అభిమానుల్లో ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా ద్వారా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండగా.. మరో స్టార్ హీరోయిన్ రీ ఎంట్రీ కూడా ఫిక్స్ చేసేశాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ మధ్య వరుస సినిమాలు చేసిన సంగీతను సంప్రదించారట అనిల్ రావిపూడి. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఆమెను మెప్పించి రీ ఎంట్రీకి సిద్ధం చేశారట. ఈ మేరకు అతి త్వరలోనే 'సరిలేరు నీకెవ్వరు' సెట్స్ పైకి సంగీత రానుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే సినిమాకు మరో పాజిటివ్ పాయింట్ చేకూరినట్లే అవుతుంది.

మహేష్ బాబు కెరీర్ లో 26 వ సినిమాగా వస్తున్న 'సరిలేరు నీకెవ్వరు'లో మహేష్ బాబు సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండటం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని నింపుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు.


Click it and Unblock the Notifications











