ఎనర్జిటిక్ హీరోతో శృతి హాసన్?
ఎనర్జిటిక్ హీరో రామ్తో కమల్ హాసన్ తనయ శృతి హాసన్ జతకట్టబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్న ఈచిత్రానికి బెల్లకొండ సురేష్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.
అయితే శృతి హాసన్ ఇంకా ఈ చిత్రానికి సైన్ చేయలేదని, ఆమె సైన్ చేసిన తర్వాత ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. సంగీత దర్శకుడు థమన్ తన ట్విట్టర్లో రామ్, శృతి హాసన్ కలిసి నటించే అవకాశం ఉందని, త్వరలోనే ఈ విషయం ఖరారు కానుందని పేర్కొనడం పై విషయాలకు మరింత బలం చేకూరుస్తోంది.
ప్రస్తుతం రామ్ కరుణాకరణ్ దర్శకత్వంలో 'ఎందుకంటే ప్రేమంట' చిత్రంలో నటిస్తున్నాడు. స్రవంతి మూవీస్ బ్యానర్పై పి.రవి కిషోర్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. మే 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
శృతి హాసన్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ చిత్రంలో నటిస్తోంది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఇన్ని రోజులైనా కెరీర్లో ఇప్పటి వరకు సరైన హిట్ లేని శృతి హాసన్ 'గబ్బర్ సింగ్' చిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకుంది. సరైన హిట్లు లేకున్నా శృతి హాసన్కు అవకాశాలు ముంచెత్తుతూనే ఉన్నాయి. ఈ చిత్రం హిట్టయితే శృతికి అవకాశాల వరద ఖాయం.


Click it and Unblock the Notifications











