Guntur karam: మహేశ్కు హ్యాండిచ్చిన ఆ ఇద్దరు.. అందుకే ఆపేశారా!
తెలుగులో కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్గా నిలుస్తున్న హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. కెరీర్ మొత్తంలో కొన్ని ప్రయోగాలు చేసినా.. ఎక్కువగా వాణిజ్య పరమైన చిత్రాలనే చేస్తూ వస్తున్నాడు. ఇలా ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో మహేశ్ బాబు 'గుంటూరు కారం' అనే సినిమాను చేస్తున్నాడు. 'అతడు', 'ఖలేజా' వంటి రెండు క్లాసిక్ చిత్రాల తర్వాత వీళ్ల కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీపై ఆరంభంలోనే భారీ హైప్ ఏర్పడిందని చెప్పొచ్చు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా నెలల క్రితమే ప్రారంభం అయింది. ఆ వెంటనే కొన్ని షెడ్యూళ్లను కూడా విజయవంతంగానే పూర్తి చేసుకున్నారు. అయితే, తర్వాత అనుకోని అవాంతరాలు ఎదురు కావడంతో చిత్రీకరణకు వరుసగా బ్రేకులు పడుతూ వచ్చాయి. తర్వాత షూట్ జరిగినా మళ్లీ వాయిదా పడింది. ఇక, ఈ వారమే మరో షెడ్యూల్ను ప్రారంభించాలని అనుకున్నా.. అది వర్కౌట్ కాలేదు. తాజాగా దీనిపై ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది.

'గుంటూరు కారం' మూవీకి కొత్త షెడ్యూల్ గత సోమవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, దీన్ని జూన్ 20కి వాయిదా వేశారని అన్నారు. అయితే, అప్పుడు కూడా ఈ షూటింగ్ జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. దీనికి కారణం ఇందులో హీరోయిన్గా నటిస్తోన్న శ్రీలీలతో పాటు మహేశ్ బాబు తాతగా చేస్తున్న ప్రకాశ్ రాజ్ డేట్లు ఇవ్వకపోవడమే అని సమాచారం. దీంతో ఈ షెడ్యూల్ను మరోసారి క్యాన్సిల్ చేయడంతో పాటు జూలై నెలకు వాయిదా వేసినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబోలో వస్తున్న 'గుంటూరు కారం' సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











