‘బాహుబలి’ తర్వాత మళ్లీ కలుస్తున్న ప్రభాస్ - రాజమౌళి.. ఈ సారి భారీ ప్లాన్ వేశారుగా.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనాలకు మారు పేరుగా నిలుస్తున్నారు టాప్ డైరెక్టర్ రాజమౌళి. కొంత కాలంగా ఆయన తెరకెక్కిస్తున్న సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తం అవుతోంది. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ హిట్లు అవడంతో పాటు భారీ వసూళ్లను రాబట్టాయి. ఇక, కొంత కాలం కిందట వచ్చిన 'బాహుబలి' సిరీస్ ఇండియన్ సినిమాపై ఎంతటి ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ టాలీవుడ్లోనే భారీ క్రేజ్ ఉన్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్తో మరోసారి కలవబోతున్నాడట. ఈ ఇద్దరూ వేసిన ప్లాన్కు చాలా మంది భయపడిపోతున్నారట. ఇంతకీ వీళ్లెందుకు కలుస్తున్నారు.? వివరాల్లోకి వెళితే....

ఐదు సంవత్సరాల శ్రమ వృథా కాలేదు
ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘బాహుబలి'. అనుష్క, తమన్నా, రానా దగ్గుబాటి, నాజర్, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ రెండు భాగాలుగా విడుదలైంది. దీని చిత్రీకరణకు దాదాపు ఐదేళ్ల సమయం పట్టింది. అయినప్పటికీ.. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు నిర్మాతలకు కాసులు కురిపించింది.

ఇద్దరు స్టార్ హీరోలతో ప్రయోగం చేస్తున్నాడు
‘బాహుబలి' సిరీస్ తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న సినిమా RRR. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ మూవీ.. భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. ఇందులో హాలీవుడ్, బాలీవుడ్ నటులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇందులో తారక్... కొమరం భీమ్గా, చరణ్.. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత.

మరోసారి అభిమానులకు నిరాశ తప్పట్లే
RRRను మొదట జూలై 30, 2020న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవడంతో పాటు మరికొన్ని కారణాల వల్ల ఈ విడుదల తేదీని మార్చేశారు. ఈ మేరకు చిత్ర యూనిట్ బుధవారం కొత్త రిలీజ్ డేట్ను కూడా ప్రకటించింది. దీని ప్రకారం.. RRRను 2021 జనవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

మళ్లీ కలుస్తున్న ప్రభాస్ - రాజమౌళి
ఈ సినిమా రిలీజ్ డేట్ మారిన రోజే దర్శకధీరుడు రాజమౌళి గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఆయన త్వరలోనే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్తో కలిసి ఓ ప్రొడక్షన్ హౌస్ను ప్రారంభించబోతున్నారట. ఈ సంస్థ ద్వారా టాలెంట్ ఉండి అవకాశాలు రాని వాళ్లతో సినిమాలు చేస్తారని అంటున్నారు. ఈ ప్రొడక్షన్ హౌస్ ప్రకటన వారంలో వెలువడనుందని సమాచారం.

వాళ్లిద్దరూ పెట్టుబడులు పెడుతున్నారు
వాస్తవానికి రాజమౌళి, ప్రభాస్ ఇద్దరూ ఇప్పటికే నిర్మాణ సంస్థలలో పెట్టుబడులు పెడుతున్నారన్న టాక్ ఉంది. టాలీవుడ్లో టాప్ ప్రొడక్షన్ హౌస్గా ఉన్న యూవీ క్రియేషన్స్కు ప్రభాస్ భాగస్వామి అన్న విషయం గతంలో బయటకు వచ్చింది. అలాగే, మరో ప్రొడక్షన్ హౌస్ వారాహి చలన చిత్ర సంస్థలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి భాగస్వామ్యం ఉందని కూడా అనుకున్నారు.

ప్రభాస్ రొమాంటిక్గా సెట్ చేస్తున్నాడు
రాజమౌళి RRR సినిమా చేస్తుండగా.. ప్రభాస్ మాత్రం రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ‘జాన్' (వర్కింగ్ టైటిల్)లో నటిస్తున్నాడు. 1960 దశకానికి చెందిన ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోందని ప్రచారం జరుగుతోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. గోపీకృష్ణ బ్యానర్తో పాటు యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











