SSMB29 OTT: రికార్డ్ ధరకు మహేశ్ మూవీ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ డేట్ లాక్? ఏ సంవత్సరంలో అంటే?
సూపర్స్టార్ మహేశ్ బాబుతో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ఎస్ఎస్ఎంబీ 29. మహేశ్ కెరీర్లో 29వ సినిమాగా నిర్మాణం జరుపుకుంటోంది. ఆర్ఆర్ఆర్తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన జక్కన్న.. ఈ చిత్రం పాన్ వరల్డ్ మార్కెట్పై కన్నేశారు. టాలీవుడ్ నుంచి తొలి పాన్ వరల్డ్ సినిమాగా ఎస్ఎస్ఎంబీ 29 ఘనత దక్కించుకోనుంది. ఈ సినిమాతో రాజమౌళి.. ఎన్ని రికార్డులు బద్ధలు కొడతాడు? ఎన్ని సంచలనాలు నమోదు చేస్తాడోనని చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తోంది. తాజాగా ఎస్ఎస్ఎంబీ 29 సెట్స్పై ఉండగానే ఈ మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
1000 కోట్ల బడ్జెట్తో ఎస్ఎస్ఎంబీ 29
దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో కేఎల్ నారాయణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత వీ విజయేంద్ర ప్రసాద్.. ఎస్ఎస్ఎంబీ 29కి కథను అందిస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు స్వర సారథ్యం వహిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ దిగ్గజం నానాపటేకర్, తమిళ సీనియర్ నటుడు ఆర్ మాధవన్ భాగమైనట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి.

స్పెషల్ డ్యాన్స్ నేర్చుకున్న ప్రియాంక
ఇదిలాఉండగా ఎస్ఎస్ఎంబీ 29 కోసం ఒడిశాలోని మయుర్ భంజ్ ఛౌ అనే ప్రత్యేక నృత్యాన్ని ప్రియాంక చోప్రా నేర్చుకున్నారు. ఈ నృత్యరీతిలో ప్రఖ్యాతి గాంచిన ఒడిశా కళాకారుడు విక్కీ భర్తియ దగ్గర ప్రియాంక ఈ శిక్షణ తీసుకున్నారు. దీని ప్రదర్శన సమయంలో ముఖానికి ఎలాంటి ముసుగులు ధరించాల్సిన అవసరం లేదు. ఒడిశా ఛౌ నృత్యంలోని మూడు విభిన్న నృత్యశైలులో మయూర్ భంజ్ ఛౌ నృత్యం కూడా ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.
కెన్యాలో ఎస్ఎస్ఎంబీ యూనిట్
ఎస్ఎస్ఎంబీ 29 ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసిన నాటి నుంచి అసలు ఈ సినిమా కథేంటీ? నటీనటులు ఎవరు? టెక్నీషియన్స్ ఎవరు? బడ్జెట్ ఎంత? అంటూ సినీవర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. హైదరాబాద్తో పాటు ఒడిశాలో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఎస్ఎస్ఎంబీ 29 యూనిట్ ప్రస్తుతం ఆఫ్రికా ఖండంలోని కెన్యాలో అడుగుపెట్టింది. ఇక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్లు, అడ్వెంచర్ ఎపిసోడ్లు చిత్రీకరించనున్నారని టాక్. కెన్యాలోని ప్రఖ్యాత అంబోసెలి నేషనల్ పార్క్లో రాజమౌళి కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం.
50 కోట్లతో భారీ సెట్
ఎస్ఎస్ఎంబీ 29 సినిమాలోని ఓ కీలక సన్నివేశం చిత్రీకరణ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో రూ.50 కోట్ల భారీ వ్యయంతో వారణాసి సెట్ వేయించారట రాజమౌళి. ఈ వార్త తెలిసి టాలీవుడ్ టూ బాలీవుడ్ జనాలు షాక్ అవుతున్నాయి. రామాయణం, హనుమంతుడి సంజీవని మూలిక చుట్టూ ఎస్ఎస్ఎంబీ 29 సినిమా నడుస్తుందని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. కానీ అసలు కథేంటీ అనేది మాత్రం తెలియరాలేదు. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ అదిరిపోయేలా జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఎస్ఎస్ఎంబీ 29 రైట్స్కి భారీ డిమాండ్
తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్లలో థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎస్ఎస్ఎంబీ 29కి ఫ్యాన్సీ రేటును ఆఫర్ చేస్తున్నారు. ఇక డిజిటల్, శాటిలైట్, ఆడియో రేట్స్ కోసం టాప్ కంపెనీలు ఎంతైనా సరే ఇవ్వడానికి కాచుకుని కూర్చొన్నాయి. తాజాగా ఎస్ఎస్ఎంబీ 29 ఓటీటీ డీల్కు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. మహేశ్ బాబు- రాజమౌళి మూవీ డిజిటల్ రైట్స్ను ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ కళ్లు చెదిరే ధరకు సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే అది ఎంత మొత్తానికి అన్న ఫిగర్ మాత్రం బయటకు రాలేదు.
ఎస్ఎస్ఎంబీ 29 ఓటీటీ డీల్
ఫిలింనగర్ టాక్ ప్రకారం ఈ ఓటీటీ డీల్ విలువ వందల కోట్ల పైమాటేనని అంటున్నారు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే ఓటీటీ రిలీజ్ డేట్ ముందుగానే లాక్ అయినట్లుగా చెబుతున్నారు. 2027లో ఎస్ఎస్ఎంబీ 29ని థియేటర్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారని గాసిప్స్ వస్తున్నాయి. రాజమౌళి గత చిత్రం ఆర్ఆర్ఆర్ కూడా మార్చి 25న రిలీజై రికార్డుల దుమ్ముదులిపిన నేపథ్యంలో అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారని ఫిలింనగర్ టాక్. మార్చిలో థియేటర్లో వస్తే.. మేలో ఎస్ఎస్ఎంబీ 29 ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. త్వరలోనే నెట్ఫ్లిక్స్తో కుదుర్చుకున్న డీల్ గురించి ఎస్ఎస్ఎంబీ 29 మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











