సునీల్,సిద్దార్ధ కాంబినేషన్ లో చిత్రం
ఇప్పుడు తెలుగులో మల్టి స్టారర్ గాలులు వీస్తున్నాయి. మహేష్,వెంకటేష్ కలిసి సీతమ్మ వాకిట్లో కలిసి నటించటంతో మొదలైన ఈ ట్రెండ్ బాలకృష్ణ..ఊ కొడతారా ఉలిక్కి పడతారాలో, మంచు మనోజ్ తో చేసేదాకా కొనసాగుతోంది. అయిత తాజాగా సిద్దార్ద,సునీల్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందించటానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సిద్దార్దతో చిత్రం చేస్తున్న నందినీరెడ్డి ఈ కాంబినేషన్ కి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ స్టోరీలైన్ ని ఇద్దరికీ ఆమె వినిపించిందని వారు ఆసక్తి చూపించారని చెప్తున్నారు.
ఇక ప్రస్తుతం సునీల్ రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి. పతాకంపై ఉదయశంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం . ఈ చిత్రానికి డి.సురేష్బాబు నిర్మాత...డి.రామానాయుడు సమర్పకులు. పూర్తి కామెడీతో నడిచిపోయే ఈ చిత్రం గురించి సునీల్ మాట్లాడుతూ ''ఈ సంస్థ నిర్మించిన చాలా సినిమాల్లో నేను నటించాను. స్క్రిప్ట్ వినగానే నాకు 'అహనా పెళ్ళంట' సినిమానే గుర్తుకొచ్చింది. తొలి సన్నివేశం నుంచి చివరి వరకూ వినోదం పండించేందుకు ఆస్కారమున్న కథాంశమిది. మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. వినోదంతోపాటు, యాక్షన్, నృత్యాలు... ఇలా అన్ని అంశాలు ఇందులో ఉంటాయి''అన్నారు.
అలాగే ఈ చిత్రంతో పాటు దేవి ప్రసాద్ దర్శకత్వంలో రాధా కృష్ణుడు అనే చిత్రం చేస్తున్నాడు. బాలీవుడ్ సూపర్ హిట్ తను వెడ్స్ మను రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం రీమేక్ ని సూపర్ గుడ్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా పూర్తి కామెడీగా సునీల్ బాడీ లాంగ్వేజ్ కి తగినట్లు దర్శకుడు దేవి మార్చి రూపొందిస్తున్నట్లు సమాచారం. దేవి గతంలో బ్లేడు బాబ్డీ,ఆడుతూ పాడుతూ వంటి చిత్రాలు రూపొందించారు.
సిద్దార్ధ విషయానికి వస్తే ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం చేస్తున్నారు. నందినీ రెడ్డి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తుంటే సమంత హీరోయిన్ గా చేస్తోంది. రొమాంటిక్ కామెడీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చెప్తున్నారు. అలా మొదలైంది చిత్రం లాగానే ఇది కూడా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. సిద్దార్ధ గత చిత్రం లవ్ ఫెయిల్యూర్ భాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాలేదు.


Click it and Unblock the Notifications











