Kanguva : ఆ చిన్న తప్పు కంగువాను ముంచేసిందా? సూర్య చేతుల్లోనే 350 కోట్లు!
ఒక చిన్న తప్పు జీవితాలను నాశనం చేస్తుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే చిన్న ఎమరపాటు బతుకుల్ని తలకిందులు చేస్తుంది. ఇది అన్ని రంగాలకు , వ్యక్తులకు కూడా వర్తిస్తుంది. ఇక కోట్ల రూపాయల ఖర్చుతో తీసే సినిమాల విషయంలో మేకర్స్ ఇంకేంత జాగ్రత్తగా ఉండాలి. ఏళ్లకు ఏళ్లు సినిమాలు తీసి, నటీనటులు తమ ప్రాణమంతా పెట్టే సినిమా కొందరి కారణంగా అడ్రస్ లేకుండా పోతోంది. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియా మూవీ కంగువా చిన్న తప్పు కారణంగా దారుణమైన ఫలితాలను చూస్తోంది. ఈ వివరాల్లోకి వెళితే..
సూర్య , దిశా పటానీ, బాబీ డియోల్ నటించిన కంగువా ఎప్పుడో థియేటర్లలోకి రావాల్సి ఉండగా .. కొన్ని కారణాలతో వాయిదా పడింది. సిరుత్తై శివ దర్శకత్వం వహించిన కంగువా చిల్డ్రన్స్ డే కానుకగా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ముఖ చిత్ర నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్పై ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్లు సంయుక్తంగా దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. క్రీస్తు శకం 1000 - 1100 శతాబ్ధాల మధ్య జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా పీరియాడికల్ మూవీగా ఈ సినిమాను రూపొందించారు.

ముందు నుంచే భారీ హైప్ తెచ్చుకున్న కంగువా ప్రీ రిలీజ్ బిజినెస్ 190 కోట్ల రూపాయల మేర జరగ్గా.. సూర్య మూవీకి రూ. 195 కోట్ల షేర్, 390 కోట్ల గ్రాస్ను బ్రేక్ ఈవెన్ టార్గెట్గా నిర్దేశించారు. భారీ అంచనాల నేపథ్యంలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 6000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. మూడు రోజుల వరకు కంగువా ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల వరకు వసూళ్లు సాధించగా , బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాదాపు రూ.130 కోట్ల వరకు ఉంది. ఈ పరిణామాలతో సూర్య మూవీ లక్ష్యాన్ని కొడుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే కొందరు కావాలనే కంగువాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ రివ్యూలు, నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ బాహుబలిగా పేరు తెచ్చుకున్న కంగువాను కావాలనే తొక్కేస్తున్నారంటూ హీరో సూర్య భార్య, నటి జ్యోతిక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ నోట్ వదిలిన ఆమె.. తొలి అరగంట బాలేదు, మ్యూజిక్ కూడా లౌడ్గా ఉందన్న మాట వాస్తవమేనని, కానీ మూడు గంటల సినిమాలో అరగంట తీసేస్తే మిగిలిన రెండున్నర గంటల సినిమా గురించి ఎవరూ మాట్లాడటం లేదని జ్యోతిక మండిపడ్డారు. సినిమాల్లో తప్పులు సహజమేనని కానీ కానీ నెగిటివ్ రివ్యూలు రాసి కంగువాపై దుష్ప్రచారం చేస్తున్నారని జ్యోతిక ఆరోపించారు. నటీనటులు, చిత్ర యూనిట్ కష్టానికి ప్రతిఫలం దక్కాలని ఆమె ఆకాంక్షించారు.

కాగా.. కంగువా తొలి అర్ధభాగంలోని కీలక సన్నివేశాల్లో సౌండ్ మరీ హైగా వినిపించిందని క్రిటిక్స్ రాశారు. ఇదే సమయంలో ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. దీనిపై ఆస్కార్ అవార్డ్ విజేత , సౌండ్ ఇంజనీర్ రసూల్ స్పందించారు. ఇలాంటి చిత్రాలకు సంగీతం అందించడం ఎంతో కష్టమని.. సినిమా తెరకెక్కించే సమయంలో జరిగే చిన్న తప్పిదాల కారణంగా మొత్తం సినిమా ప్రమాదంలో పడుతుందని ఆయన పేర్కొన్నారు. క్లైమాక్స్ తర్వాత ప్రేక్షకుడు థియేటర్ నుంచి తలనొప్పితో బయటికి వెళ్లకూడదని.. ఇదే జరిగితే రిపీటెడ్ ఆడియన్స్ ఉండరని ఆయన హెచ్చరించారు. మొత్తానికి చిన్న సౌండ్ దాదాపు రూ. 350 కోట్ల కంగువాను ప్రమాదంలో నెట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











