‘తడ’లో 3వేల ఎకరాల్లో సినీ పరిశ్రమ... వైజాగ్ పరిస్థితేంటి?
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ వేరే ప్రాంతాలకు తరలి వెలుతుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్లోనే ఎక్కువ సౌకర్యాలు ఉన్నందున పరిశ్రమ ఎక్కడీకి తరలి పోదని కొందరు పెద్దలు చెబుతున్నప్పటికీ.... ఎక్కడ రాయితీలు, సబ్సిడీలు ఇస్తే అక్కడకు పరిశ్రమ వెళ్లి తీరుతుందని సురేష్ బాబు లాంటి వారు అంటున్నారు.
తాజాగా ఫిల్మ్ నగర్లో మరో ప్రచారం మొదలైంది. సినీ పరిశ్రమకు హైదరాబాద్ నుండి తరలి పోవడం ఖాయమని అంటున్నారు. చెన్నైకి సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 'తడ' ప్రాంతంలో సినీ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. విషయం ముందే గ్రహించిన డి.సురేష్ బాబు, మరికొందరు ప్రముఖ నిర్మాతలు 'తడ' ప్రాంతంలో 3 వేల ఎకరాలను కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సురేష్ బాబు, వెంచర్ కాపిటిలిస్ట్ శ్రీని రాజు కలిసి...ఆంధ్రప్రదేశ్, తమిళనాడు బోర్డర్ లో తడ, శ్రీ సిటీ సెజ్ వద్ద ఓ ఫిల్మ్ స్టూడియో నిర్మాణం మొదలపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారట. సినీ నిర్మాణానికి ప్రతి విషయానికి చెన్నై వెళ్ళి రావాల్సి ఉన్నందున 'తడ' అందుకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో అక్కడ స్టూడియోలు కట్టాలని సన్నాహాలు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది.
'తడ' ప్రాంతానికి నెల్లూరు జిల్లా పులికాట్ సరస్సు కూడా చాలా దగ్గరగా ఉంది. కృష్ణపట్నం పోర్టు కూడా అక్కడే ఉండటంతో భవిష్యత్లో బాగా ఎదుగుదలకు ఉపయోగపడుతుందని అంటున్నారు. చెన్నై కూడా దగ్గరగా ఉండటంతో అన్ని ఆంధ్రప్రదేశ్లో కొత్త సినీ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ఇదే సరైన ప్రాంతమని అంటున్నారు. చాలా మంది నిర్మాతల ఆలోచన కూడా ఇదే నట.
వైజాగ్ పరిస్థితి ఏమిటి.....?
అయితే మరో వైపు కొందరు నిర్మాతలు వైజాగ్ ప్రాంతానికి సినీ పరిశ్రమ వస్తుందని అక్కడి పరిసరాల్లో భూములు కొనుగోలు చేస్తున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి తన సన్నిహితుల ద్వారా వైజాగ్ ప్రాంతంలో ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇపుడు కొత్తగా 'తడ' పేరు తెరపైకి రావడంతో 'వైజాగ్' ప్రాంతంలో ఆస్తులు కొంటున్న నిర్మాతలు అయోమయానికి గురవుతున్నారు.


Click it and Unblock the Notifications











