మహేషా..? పవనా..? అమీర్ ఖాన్ లో సందిగ్ధం
మహేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ తెలుగులో మాస్ లోనూ,క్లాస్ లోనూ బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న హీరోలే. అయితే వీళ్లద్దరిలో ఎవరిని తన తాజా టీవీ షో సత్యమేవ జయితే కి తీసుకుంటాడనదే అందరిలో ఆసక్తికరంగా మారిన విషయం. తన వాయిస్ కి తెలుగు డబ్బింగ్ కోసం ఈ హీరోలలో ఒకరిని ఎంపిక చేసుకుని అడుగుదామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అమీర్ ఖాన్ స్వయంగా హైదరాబాద్ వచ్చి అడగనున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఎవరిని అమీర్ కలవబోతున్నాడనేది మాత్రం సస్పెన్స్ అంటున్నారు.
ఇక రీసెంట్ గా అమీర్ ఖాన్...కేరళ వెళ్లి మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తన పోగ్రాంకి వాయిస్ ఇవ్వమని అడిగి ఒప్పించుకున్నారు. అమీర్ ఖాన్ అంతటి స్టార్ అడిగితే కాదనే వారు ఎవరుంటారు. దాంతో అమీర్ అడిగితే తప్పకుండా వాయిస్ ఇవ్వటానకి హీరోలు సిద్దంగా ఉంటాడంటున్నారు. ఇక్కడ లోకల్ స్టార్స్ ని తీసుకోవటం ద్వారా సత్యమేవ జయితే కి ఎగస్ట్రా మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు. నేషనల్ లెవెల్లో సూపర్ హిట్ అయిన ఈ పోగ్రాంని రీజనల్ లెవిల్లో కూడా క్లిక్ అవ్వాలంటే ఈ మేరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు.
ఇక ఈ షో గురించి అమీర్ ఖాన్ మాట్లాడుతూ...''ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ... దేశభక్తి తప్పకుండా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి తన దేశం గురించి ఆలోచిస్తారు. నేను కూడా అంతే. నా చుట్టూ ఉన్న సమాజం, సాధకబాధకాలు చూస్తూనే ఉంటాను. వాటిపై పోరాడడానికి నేనేమీ సామాజికవేత్తను కాను. పరిష్కామార్గం సూచించడానికి మేధావినీ కాను. కానీ... ఓ సమస్యను విని అర్థం చేసుకొనే మనసు ఉంది. అది చాలు'' అని చెబుతున్నారు. ఆయన తొలిసారి బుల్లి తెరపైకి 'సత్యమేవ జయతే' కార్యక్రమంతో వచ్చారు. అమీర్ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ కార్యక్రమానికి ఆయనే నిర్మాత.
అలాగే ''నా సినీ ప్రయాణంలో తక్కువ చిత్రాలే చేశాను. అందుకే అన్ని రకాల పాత్రలు పోషించే అవకాశం రాలేదు. ఈ కార్యక్రమం ద్వారా భిన్నమైన వ్యక్తుల్ని, మనస్తత్వాల్నీ అర్థం చేసుకొనే వీలు చిక్కింది. పిల్లలు, పెద్దవాళ్లూ, మహిళలూ... అందరూ అతిథులే. వారి జీవితాల్లోని కోణాల్ని స్పృశించే వీలు చిక్కింది. చాలా సందర్భాల్లో భావోద్వేగాలు ఆపుకోలేకపోయాను. ఈ షోలో నేను మనస్ఫూర్తిగా నవ్వాను, చాలా సందర్భాల్లో ఏడ్చాను. కన్నీళ్లొస్తున్నప్పుడు ఎందుకు ఆపుకోవాలి? టీవీ చాలా బలమైన మీడియా. దాన్ని పూర్తిగా అర్థం చేసుకొన్నానో లేదో తెలీదుగానీ నేను చెప్పదలచుకొన్న విషయాన్ని మాత్రం సూటిగానే చెప్పాను. ఓ నిజాన్ని గెలిపించడానికి నిజాయతీతో చేస్తున్న ప్రయత్నమిది. టీఆర్పీ రేటింగ్స్ గురించి నాకు ఎలాంటి బెంగా లేదు. దాన్ని పెంచుకోవడానికి ఎలాంటి జిమ్మిక్కులూ చేయడం లేదు. నా భావనలు ప్రేక్షకులకు అర్థమైతే చాలు..'' అంటూ చెప్పుకొచ్చారాయన.


Click it and Unblock the Notifications











