చంద్రబాబు, వైఎస్సార్లపై వెబ్ సిరీస్.. CBNగా బోయపాటి విలన్? YSRగా ఎవరంటే?
కరోనా సమయంలో అందుబాటులోకి వచ్చిన ఓటీటీలు ప్రేక్షకుల అభిరుచిని పూర్తిగా మార్చేశాయి. ప్రపంచంలోని అన్ని పరిశ్రమలకు చెందిన కంటెంట్ అందుబాటులో ఉండటంతో వాటిని, మన సినిమాలను ప్రేక్షకులు పోల్చి చూస్తున్నారు. కథ , కథనాల్లో విషయం లేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో నటించినా ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. అందుకే దర్శక నిర్మాతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని సినిమాలు తీసి మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
బయోపిక్స్పై ఓటీటీ సంస్థల చూపు
నిన్న మొన్నటి వరకు నిర్మాతలు, ప్రొడక్షన్ కంపెనీల నుంచి ఓటీటీ సంస్థలు సినిమాల డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేసేవి. అయితే ఇప్పుడు ఓటీటీ సంస్థలే నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రేక్షకుడికి ఏం కావాలో పక్కా అంచనాతో ఒరిజినల్ కంటెంట్, వెబ్ సిరీస్లు తీసుకొస్తున్నాయి. బయోపిక్లు, వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే వెబ్ సిరీస్లు, సినిమాలను ప్రేక్షకులు ఇష్టపడుతుండటంతో ఓటీటీ సంస్థలు కూడా అలాంటి వాటినే నిర్మిస్తున్నాయి. జనానికి బాగా తెలిసిన కథలనే సినిమాలుగా, వెబ్ సిరీస్లుగా తీసుకొచ్చి హిట్ కొడుతున్నాయి.

విలక్షణ దర్శకుడిగా దేవకట్టా
తెలుగునాట విలక్షణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు దేవకట్టా. వెన్నెల సినిమాతో కెరీర్ ప్రారంభించిన దేవాకట్టా అభిరుచి గల దర్శకుగా మన్ననలు అందుకున్నారు. ఆ తర్వాత ఐదేళ్లకు ప్రస్థానం సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డ్ సాధించారు. ఆ తర్వాత నాలుగేళ్లకు ఆటోనగర్ సూర్య, ఆ తర్వాత మూడేళ్లకు రిపబ్లిక్ సినిమాను తీశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో దేవా కట్టా డైలమాలో పడ్డారు. సినిమా ఫ్లాపైనా సామాజిక సందేశాల చుట్టూనే తన సినిమాలు తీస్తున్నారు దేవకట్టా.
చంద్రబాబు, వైఎస్సార్లపై వెబ్ సిరీస్
ఈ క్రమంలో తన స్టైల్లో సోషల్ ఎలిమెంట్స్తో ఇంట్రెస్టింగ్ స్టోరీ రెడీ చేశారట దేవా కట్టా. అది కూడా ఓ వెబ్ సిరీస్ రూపంలో కావడం గమనార్హం. తెలుగు రాజకీయాల్లో దిగ్గజాలుగా పేరొందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు జీవితాలు, వారి మధ్య నడిచిన వైరం, రాజకీయాల ఆధారంగా మయసభ పేరుతో వెబ్ సిరీస్ సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 1978లో కాంగ్రెస్ తరపున తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటి నుంచి వైఎస్ఆర్, చంద్రబాబులు ప్రాణ స్నేహితులుగా మెలిగారు.
ప్రాణ మిత్రులు బద్ధ విరోధులుగా
అనంతరం ఎన్టీఆర్కి చంద్రబాబు అల్లుడై, తెలుగుదేశం పార్టీలో చేరారు. 1995లో టీడీపీలో చోటు చేసుకున్న సంక్షోభ సమయంలో ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా పగ్గాలు అందుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం కాంగ్రెస్లోనే కొనసాగుతూ సీఎల్పీ నేతగా.. చంద్రబాబు పాలనపై విమర్శలు చేసేవారు. అనంతరం 2004లో పాదయాత్ర తర్వాత ఉమ్మడి ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టి 2009లో మరోసారి విజయం సాధించారు. రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ 2009లో హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం పాలయ్యారు.
3 భాగాలుగా వెబ్ సిరీస్
వీరిద్దరి జీవితాల చుట్టూ దేవకట్టా ఈ వెబ్ సిరీస్ నిర్మించినట్లుగా వార్తలు గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఇందులో చంద్రబాబు పాత్రలో ఆది పినిశెట్టి నటించబోతున్నట్లుగా టాక్. అలాగే వైఎస్ఆర్గా 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు నటించనున్నట్లుగా పుకార్లు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మూడు సీజన్లుగా ఈ సిరీస్ను స్ట్రీమింగ్లోకి తీసుకొస్తారని .. 2025 చివరి నాటికి ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేస్తారని టాక్. సోని లీవ్ ఓటీటీలో తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. సాయి కుమార్, నాజర్, దివ్య దుట్టా, తాన్య రవిచంద్రన్, శ్రీకాంత్ అయ్యంగార్లు ఈ వెబ్ సిరీస్లో కీలకపాత్రలు పోషించనున్నట్లుగా టాక్.


Click it and Unblock the Notifications











