ఆ దర్శకుడి చేతికి ఘట్టమనేని వారసుడి లాంచింగ్ .. భారీ ప్లానింగ్తో మహేష్!
తెలుగు చిత్ర పరిశ్రమలోని బిగ్ స్టార్స్ సహా ఛోటా మోటా నటులు, టెక్నీషియన్స్ తమ వారసులను పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే నందమూరి నటసింహం బాలకృష్ణ తన వారసుడిగా మోక్షజ్ఞను ఎంట్రీకి రంగం సిద్ధం చేశారు. పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. విక్టరీ వెంకటేష్ కూడా తన కొడుకును లాంఛ్ ఛేయాలని చూస్తున్నారు. చివరికి మ్యూజిక్ డైరెక్టర్లు, దర్శకులు, నిర్మాతల పిల్లలు కూడా త్వరలోనే టాలీవుడ్లోకి ఎంట్రి ఇస్తున్నారు.
టాలీవుడ్లోని పెద్ద కుటుంబాల్లో ఘట్టమనేని ఫ్యామిలీ కూడా ఒకటి. తెలుగు చిత్ర పరిశ్రమలో సాహసానికి, మంచితనానికి కేరాఫ్గా నిలిచారు సూపర్స్టార్ కృష్ణ. టాలీవుడ్కు సాంకేతికతను పరిచయం చేసి టెక్నాలజీ పరంగా తెలుగు చిత్ర పరిశ్రమను ఓ మెట్టు పైకెక్కించారు కృష్ణ. దాదాపు ఆరు దశాబ్ధాల పాటు నటుడిగా, నిర్మాతగా, ఎడిటర్గా, దర్శకుడిగా, డిస్ట్రిబ్యూటర్గా, స్టూడియో అధినేతగా తెలుగు చిత్ర పరిశ్రమపై ఆయన చెరగని ముద్రవేశారు. 80 ఏళ్ల వయసులో అనారోగ్యానికి గురై రెండేళ్ల క్రితం కృష్ణ కన్నుమూశారు.

కృష్ణ వెంట నడిచిన సోదరులు
ఘట్టమనేని కుటుంబం నుంచి తొలుత కృష్ణతో పాటు ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు, హనుమంతరావులు సినీ రంగంలో అడుగుపెట్టారు. వీరిద్దరూ నిర్మాతలుగా పద్మాలయా స్టూడియో వ్యవహారాలు చూసుకునేవారు. అన్న ఏం చెబితే అది చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. కృష్ణ నటవారసుడిగా ఆయన పెద్ద కుమారుడు రమేశ్ బాబు ఎంట్రీ ఇచ్చారు. సామ్రాట్ సినిమాలో నటించిన ఆయన హిట్ అందుకున్నప్పటికీ ఆ జోరు కొనసాగించలేకపోయారు. కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూ రెండేళ్ల క్రితం రమేశ్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు.
కృష్ణ కొడుకులు, కూతుళ్లు, అల్లుడు కూడా ఇండస్ట్రీలోనే
రమేశ్ తర్వాత మంజుల, మహేశ్ బాబులు కృష్ణ కుటుంబం నుంచి వెండితెరపై అడుగుపెట్టారు. మంజుల క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అప్పుడప్పుడు నటిస్తున్నారు. మహేశ్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా, టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా, భారతదేశంలో అత్యాధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో ఒకరిగా నిలిచారు. కృష్ణ చిన్నకుమార్తె ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు కూడా ఘట్టమనేని కుటుంబం ఆశీస్సులతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
మూడో తరం హీరోగా గల్లా తనయుడు
ఇక కృష్ణ కుటుంబం నుంచి మూడో తరంలో ఆయన పెద్ద కుమార్తె గల్లా పద్మావతి - జయదేవ్ గల్లా కుమారుడు అశోక్ గల్లా హీరోగా అడుగుపెట్టారు. హీరో, దేవ నందన వసుదేవ సినిమాల నటించి టాలీవుడ్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా కృష్ణ కుటుంబం నుంచి మరో వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధమైంది. దివంగత రమేశ్ బాబు పెద్ద కుమారుడు జయకృష్ణను హీరోగా లాంచ్ చేయాలని ఘట్టమనేని ఫ్యామిలీ కసరత్తు చేస్తోంది. తనకు ఎంతో ఇష్టమైన అన్నయ్య రమేశ్ బాబు కన్నుమూయడంతో ఆయన భార్యాపిల్లలకు మహేశ్ అండగా నిలిచారు.
జయకృష్ణను హీరోగా చూడాలనుకున్న రమేశ్
జయకృష్ణను హీరోను చేయాలని రమేశ్ బాబు కలలుగన్నారు. కానీ కొడుకును హీరోగా చూడకుండానే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో అన్నయ్య చివరి కోరికను తీర్చాలని మహేశ్ శ్రమిస్తున్నారు. జయకృష్ణ ఇప్పటికే అమెరికాలో యాక్టింగ్లో తీసుకున్నారు. ఓ కార్యక్రమంలో మహేశ్తో కలిసి జయకృష్ణ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లుక్, స్టైల్లో మహేశ్కు ఏమాత్రం తగ్గని విధంగా ఉన్నాడు జయకృష్ణ. ప్రస్తుతం కథలు వినే పనిలో ఉన్న కృష్ణ కుటుంబం మంచి స్క్రిప్ట్తో ఈ కుర్రాడిని గ్రాండ్గా లాంచ్ చేయాలని చూస్తున్నారు.
అజయ్ భూపతికి బిగ్ ఛాన్స్?
అయితే జయకృష్ణ తొలుత ఎవరు డైరెక్ట్ చేయనున్నారు? అనే దానిపై మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ పేరు వినిపిస్తోంది. ఆయనెవరో కాదు.. ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాలతో సత్తా చాటిన యువ దర్శకుడు అజయ్ భూపతి. ఇతను చెప్పిన కథ ఘట్టమనేని ఫ్యామిలీకి బాగా నచ్చడంతో జయకృష్ణను లాంచ్ చేసే బాధ్యతను అజయ్కి అప్పగించినట్లుగా ఫిలింనగర్లో డిస్కషన్ నడుస్తోంది. ఇద్దరు ప్రముఖ నిర్మాతలు సంయుక్తంగా జయకృష్ణను టాలీవుడ్కు పరిచయం చేయనున్నారట. దీంతో వారెవరు? సినిమా జోనర్ ఏంటీ? హీరోయిన్ ఎవరు? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. నిజంగానే జయకృష్ణ తొలి సినిమాకు దర్శకుడిగా అజయ్ భూపతి కన్ఫర్మ్ అయ్యారా? లేక ఇది గాలివార్తా? అన్నది త్వరలోనే తేలిపోనుంది.


Click it and Unblock the Notifications











