కమల్-రజనీ మల్టీస్టారర్లో త్రిష.. రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు త్రిష కృష్ణన్. తమిళనాడు రాజకీయాల్లో టీవీకే విజయంతో పాటు సీఎం విజయ్ ప్రమాణ స్వీకార వేడుకల్లో ఆమె కనిపించడం అభిమానుల్లో మరింత చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఆ కార్యక్రమంలో త్రిష హాజరు కావడం సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. మరోసారి ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమైంది. ఆ ఈవెంట్లో ఆమె స్పెషల్ అట్రాక్షన్గా నిలవడంతో మరోసారి త్రిష పేరు మార్మోగిపోయింది.
ఇదే సమయంలో త్రిష కెరీర్ పరంగా కూడా ఫుల్ ఫామ్లో ఉన్నారు. తమిళంలో సూర్య నటిస్తున్న 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు') చిత్రం ఈ నెల 14న విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన 'విశ్వంభర' కూడా రిలీజ్కు రెడీ అవుతోంది. ఇలాంటి సమయంలోనే ఆమెకు కోలీవుడ్లో మరో భారీ ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి నటించబోతున్న మల్టీస్టారర్ మూవీ. దాదాపు 46 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు లెజెండరీ స్టార్లు ఒకే తెరపై కనిపించబోతుండటంతో ఈ ప్రాజెక్ట్పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్పై ఉదయనిధి స్టాలిన్ నిర్మించనున్నట్లు సమాచారం. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.
'KHxRK Reunion' పేరుతో విడుదలైన అనౌన్స్మెంట్ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. కమల్-రజనీ కలయికను మరోసారి చూడబోతున్నామనే ఆనందంలో అభిమానులు ఉన్నారు. ఇలాంటి భారీ ప్రాజెక్ట్లో హీరోయిన్గా త్రిషను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే త్రిషకు కథ వినిపించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో నటించడానికి ఆమెకు దాదాపు రూ.12 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే త్రిష కెరీర్లోనే ఇది అత్యధిక పారితోషికాల్లో ఒకటిగా నిలవనుంది.
త్రిషకు కమల్ హాసన్, రజనీకాంత్లతో ఇది కొత్త కాంబినేషన్ కాదు. కమల్తో ఆమె 'మన్మధన్ అంబు', 'తూంగావనం', 'థగ్ లైఫ్' చిత్రాల్లో నటించారు. అలాగే రజనీకాంత్తో 'పేట' సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఈసారి ఇద్దరు దిగ్గజాలతో ఒకేసారి నటించే అవకాశం రావడం ప్రత్యేకతను సంతరించుకుంది. అందుకే ఈ వార్త నిజమైతే సినిమా హైప్ మరింత పెరగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. రజనీకాంత్ ఈ ప్రాజెక్ట్ కోసం రూ.180 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకూ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కమలహాసన్ మాత్రం కేవలం రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా ప్రాఫిట్ షేరింగ్ డీల్తో సినిమా చేస్తున్నారని టాక్. మొత్తం కలిపి ఆయనకు రూ.220 కోట్ల వరకూ వెళ్లే అవకాశముందని కోలీవుడ్ మీడియా పేర్కొంటోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్కు రూ.70 కోట్ల వరకూ రెమ్యునరేషన్ అందుతున్నట్లు సమాచారం. సంగీత దర్శకుడు అనిరుధ్కు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల మధ్య పారితోషికం ఉంటుందని చెబుతున్నారు. ఈ లెక్కలు చూస్తుంటేనే సినిమా బడ్జెట్ ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థమవుతోంది.
ఇక త్రిష విషయానికి వస్తే.. గత కొద్ది రోజులుగా ఆమె రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం కూడా గట్టిగానే సాగింది. సినిమాలకు గుడ్బై చెప్పబోతున్నారంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు వరుసగా భారీ ప్రాజెక్ట్లు ఆమెను వరించడం చూస్తుంటే.. త్రిష క్రేజ్ ఇంకా ఏ మాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది. ముఖ్యంగా కమల్-రజనీ మల్టీస్టారర్లో ఆమె నటిస్తే.. అది కోలీవుడ్లోనే కాదు సౌత్ ఇండియన్ సినిమా చరిత్రలోనే అరుదైన కాంబినేషన్గా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications




