ఎన్టీఆర్ను ఢీకొట్టబోతున్న వరలక్ష్మీ.. అదిరిపోయే ప్లాన్ వేసిన మాటల మాంత్రికుడు
'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్లపై నందమూరి కల్యాణ్ రామ్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా కథను రెడీ చేశాడట త్రివిక్రమ్. త్వరలోనే పట్టాలెక్కబోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ను తీసుకున్నారట. ఇటీవలే 'క్రాక్', 'నాంది' వంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించి సత్తా చాటిన ఆమెతో చిత్ర నిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ ఇటీవలే సంప్రదింపులు జరిపారని తెలిసింది. క్రేజీ ప్రాజెక్టు కావడంతో పాటు తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న కారణంగా జయమ్మ దీనికి వెంటనే ఓకే చెప్పేసిందని అంటున్నారు. ఆమె రాకతో ఈ సినిమాకు మరింత పవర్ యాడ్ అయినట్లు అవుతుందన్న టాక్ బాగా వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా... భారీ హిట్ తర్వాత వస్తున్న ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో రష్మిక మందన్నాతో పాటు ఓ బాలీవుడ్ హీరోయిన్ నటించే అవకాశాలు ఉన్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఈ భారీ మూవీలో సునీల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నాడని అంటున్నారు. అలాగే, 'మన్మథుడు' ఫేం అన్షు కీలక పాత్రలో కనిపించనుందట. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ చివరి వారంలో గానీ, మే మొదటి వారంలో కానీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











