Varanasi: ఐదు పాత్రల్లో మహేష్ బాబు.. రాముడుగానే కాదు.. అలా కూడా !
Varanasi: యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచిన సినిమా 'వారణాసి' (Varanasi). టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా విడుదలకు ముందే గ్లోబల్ లెవెల్లో సంచలనం సృష్టిస్తోంది. టైటిల్ గ్లింప్స్ విడుదలైన నాటి నుంచే ఈ సినిమా చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు కనిపించిన 'రుద్ర' లుక్ ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించడంతో, ఈ మూవీ సాధారణ కమర్షియల్ సినిమా కాదని స్పష్టమైంది. తాజాగా మహేశ్ బాబు పాత్రలపై ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఇంతకీ ఆ సంగతేంటీ?
రాజమౌళి ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. దీంతో సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, సోషల్ మీడియాలో అది ఇట్టే వైరల్ అవుతోంది. తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్త ప్రకారం, ఈ సినిమాలో మహేష్ బాబు ఏకంగా ఐదు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారట. ఈ బజ్ సినీ అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. ఇంతకీ ఆ ఐదు పాత్రలు ఏంటి? అవి కథతో ఎలా ముడిపడి ఉన్నాయి? అనే అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.

ఇప్పటికే ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్లో మహేష్ బాబు ప్రధానంగా 'రుద్ర' అనే సూపర్మ్యాన్ తరహా పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇది సినిమాలో కీలకమైన పాత్రగా, కథకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఇక కథానాయికగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా 'మందాకిని' అనే పాత్రలో నటిస్తున్నారని టాక్. ఆమె పాత్ర కూడా కథలో కీలక మలుపులు తిప్పే విధంగా ఉండబోతుందట.
ఇక ఈ సినిమాలో విలన్ పాత్రపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారని సమాచారం.అలాగే మహేష్ బాబు తండ్రి పాత్రలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారట. ఈ సినిమా కథ మొత్తం వారణాసి నేపథ్యంతో.. హిందూ పురాణాలు, టైమ్ టావెల్ కాన్సెప్ట్తో రూపొందుతున్నట్లు సమాచారం.
ఇక తాజాగా లీకైన వివరాల ప్రకారం.. మహేష్ బాబు రుద్ర పాత్రతో పాటు, భగవాన్ రాముడి రూపంలో, శివుడి ఛాయలున్న పాత్రలో కూడా కనిపిస్తారట. శివుడి పాత్ర నిడివి తక్కువగానే ఉన్నా, దాని ప్రభావం మాత్రం గట్టిగా ఉంటుందని చెబుతున్నారు. వీటితో పాటు మరో రెండు విభిన్నమైన షేడ్స్లో మహేష్ బాబు కనిపించబోతున్నారని, అవి కథలో కీలకమైన ట్విస్టులకు కారణమవుతాయని టాక్. ఈ ఐదు పాత్రలు పురాణాల స్ఫూర్తితో పాటు ఆధునిక టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో అనుసంధానమై ఉంటాయని తెలుస్తోంది. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే, వెండితెరపై మహేష్ బాబు విశ్వరూపాన్ని చూడటం ప్రేక్షకులకు నిజంగా కనుల పండగే. ఇప్పటివరకు ఆయన చేసిన పాత్రలన్నింటికీ భిన్నంగా, ఇది కెరీర్లోనే అత్యంత ఛాలెంజింగ్ ప్రాజెక్ట్గా మారనుంది.
ఇక 'వారణాసి' సినిమా టెక్నాలజీ పరంగా మరో స్థాయిలో ఉండబోతుంది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణంగా మారుతుందని అంటున్నారు. హాలీవుడ్కు చెందిన ప్రముఖ టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్లో భాగస్వాములవ్వడం వల్ల, విజువల్స్, వీఎఫ్ ఎక్స్ (VFX), యాక్షన్ సీక్వెన్స్లు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండనున్నాయి.
షూటింగ్ విషయానికి వస్తే.. ఈ సినిమా దాదాపు ఏడాది నుంచి వివిధ షెడ్యూల్స్లో షూటింగ్ జరుపుకుంటోంది. మహేష్ బాబు తన పాత్రలకు సంబంధించిన కీలక భాగాన్ని 2026 సమ్మర్ నాటికి పూర్తి చేయనున్నట్లు సమాచారం. మరో ఎనిమిది నెలల్లో మొత్తం షూటింగ్ పూర్తి చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత దాదాపు ఎనిమిది నెలల పాటు భారీ స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిపి, 2027 సమ్మర్లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఇక బడ్జెట్ విషయానికొస్తే, 'వారణాసి' ఇప్పటికే రికార్డుల బాటలో నడుస్తోంది. మొదట ఈ సినిమా బడ్జెట్ రూ.1000 కోట్లుగా ప్రచారం జరిగినా, తాజా టాక్ ప్రకారం అది రూ.1300 కోట్ల వరకు వెళ్లినట్లు సమాచారం. ఇలా ఎన్నో అంచనాలతో తెరకెక్కబోతున్న వారణాసి మూవీ 2027లో విడుదల కానున్నది. ఈ మూవీ గ్లోబల్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేస్తుందో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











