క్రేజీ టైటిల్తో తొలిసారి మెగా-దగ్గుబాటి మల్టీస్టారర్?: అభిమానులకు పండగే..
Recommended Video

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో టాలీవుడ్లో మల్టీ స్టారర్ ట్రెండ్ సెట్ చేశారు నిర్మాత దిల్ రాజు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇప్పుడు మరోసారి మల్టీస్టారర్ రిపీట్ చేయబోతున్నారాయన. కథ రీత్యా.. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కించాలని భావిస్తున్నారట. తాజాగా ఈ ఇద్దరు హీరోలు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కథ డిమాండ్ చేయడంతో:
గురూ సినిమాతో డీసెంట్ హిట్ తన ఖాతాలో వేసుకున్న వెంకీ.. దిల్ రాజు బ్యానర్లో తన తదుపరి చిత్రాన్ని ఓకె చేశాడు. అయితే కథ డిమాండ్ మేరకు.. ఇందులో మరో ప్రధాన పాత్ర కోసం ఓ యంగ్ హీరోను ఎంచుకోవాలనుకున్నారు. అలా దర్శకుడు అనిల్ రావిపూడి.. రానా దగ్గుబాటి లేదా సాయిధరమ్ తేజ్ లను నటింపజేయాలని భావించాడు.

వెంకీ-వరుణ్ ఫిక్స్:
రానా, సాయి ధరమ్ తేజ్ లను అనుకున్నప్పటికీ.. చివరిగా వరుణ్ తేజ్ ను కలిసి కథ వినిపించారట అనిల్ రావిపూడి. వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో.. వెంకీ కూడా ఓకె అనేశారట. మధ్యలో నాని పేరు కూడా వినిపించినప్పటికీ చివరిగా వరుణ్ తోనే ఫిక్స్ అయిపోయారట.

మెగా-దగ్గుబాటి కాంబినేషన్
ఈ సినిమా కోసం 'ఎఫ్2(ఫన్&ఫ్రస్టేషన్)..' అనే క్రేజీ టైటిల్ అనుకుంటున్నట్లు టాక్. అంతా అనుకున్నట్లు జరిగితే.. దగ్గుబాటి, మెగా హీరోలు కలిసి నటించనున్న తొలి మల్టీస్టారర్ ఇదే కావడం విశేషం.

ఇద్దరికీ హిట్ కావాలి:
ఫిదా సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ.. క్రెడిట్ అంతా సాయిపల్లవి ఖాతాలోకే వెళ్లిపోయింది. హీరోగా వరుణ్ తేజ్ కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ ఏమి లేవు. అటు వెంకీ పరిస్థితి కూడా అంతే. బాబు బంగారం పెద్ద ఫ్లాప్ గా మిగిలిపోయిన తర్వాత గురుతో డీసెంట్ హిట్ అందుకున్నాడు. అనిల్ రావిపూడి సినిమా వీరిద్దరకీ ఆ లోటును తీరుస్తుందని భావిస్తున్నారు.

దిల్ రాజు.. అనిల్ రావిపూడి:
ఈ ఏడాది దిల్ రాజు బ్యానర్లో అనిల్ రావిపూడి చేసిన 'రాజా ది గ్రేట్' మంచి విజయాన్ని అందుకుంది. సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టడంతో రావిపూడితో మరో సినిమా చేసేందుకు దిల్ రాజు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి మల్టీ స్టారర్ కథతో రావడం.. ఇప్పుడు వెంకీ-వరుణ్ కాంబినేషన్ ఓకె అవడం జరిగిపోయాయి. దిల్ రాజు బ్యానర్లోనే వరుణ్ తేజ్ కూడా 'ఫిదా' హిట్ అందుకోవడం విశేషం.

అన్నీ కుదిరితే.. వచ్చే ఏడాది:
ప్రస్తుతం వెంకీ.. తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మరోపక్క వరుణ్ తేజ్.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు. అయితే వచ్చే ఏడాదికి గాను వరుణ్ కాల్షీట్స్ ముందే బుక్ చేసుకున్నాడట దిల్ రాజు. అన్నీ కుదిరితే వెంకీ-వరుణ్ తేజ్ కాంబినేషన్లో మూవీ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్తుంది.


Click it and Unblock the Notifications











