ఫ్లాప్ సెంటిమెంట్ నుంచి మహేష్ గట్టెక్కుతాడా? బాబును వెంటాడుతున్న వాయిస్ ఓవర్ ముప్పు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీ లో ఉన్న అందరి హీరోలతో కూడా చాలా స్నేహంగా ఉంటాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు కూడా నిత్యం మహేష్ బాబు తన సపోర్ట్ అందిస్తూనే ఉంటాడు. వాయిస్ ఓవర్ అవసరమైతే స్టార్స్ కోసం ఎలాంటి విభేదాలను చూపించకుండా మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉంటాడు. అయితే మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన ప్రతి సారి కూడా తన తదుపరి సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ ను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఆచార్య సినిమాకు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహేష్ ఇంతకుముందు వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఎలాంటి అపజయాలు ఎదుర్కొన్నాడు అసలు ఆ సెంటిమెంట్ ను గట్టేక్కిస్తాడా లేదా అనే వివరాల్లోకి వెళితే..

మొదటిసారి అలా..
అగ్ర హీరోలు మరో అగ్ర హీరో సినిమాకు ఏదైనా సహకారం అందిస్తే మాత్రం ప్రేక్షకుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగి పోతూ ఉంటాయి. మహేష్ బాబు మొదటి సారి పవన్ కళ్యాణ్ జల్సా సినిమా కోసం ప్రత్యేకంగా వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడు త్రివిక్రమ్ తో ఉన్న అనుబంధం తోపాటు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ తో ఉన్న సాన్నిహిత్యం తో మహేష్ బాబు మొదటిసారి ఆ విధంగా ఒక సినిమాకు తన వాయిస్ అందించగా ఆ సినిమాకు మంచి హైప్ ఐతే క్రియేట్ అయింది.

ఖలేజా డిజాస్టర్
అయితే జల్సా సినిమా తర్వాత మహేష్ బాబు చేసిన సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆసినిమా మరేదో కాదు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసినటువంటి ఖలేజా సినిమా కావడం విశేషం. అయితే ఈ సెంటిమెంట్ను మొదట ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ ఆ తర్వాత మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన ప్రతిసారి తన తదుపరి సినిమాతో డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఎన్టీఆర్ సినిమా కోసం...
మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ బాద్షా సినిమాకు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా దర్శకుడు శ్రీను వైట్ల తో అంతకుముందే దూకుడు సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో అతను అడిగిన వెంటనే ఆ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఆ తర్వాతే మహేష్ నుంచి వచ్చిన వన్ నేనొక్కడినే సినిమా కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

బ్రహ్మోత్సవంతో మరో డిజాస్టర్
ఇక మహేష్ బాబు తన తండ్రి నటించిన శ్రీశ్రీ సినిమాకు కూడా ప్రత్యేకంగా వాయిస్ ఓవర్ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమా కావడంతో దర్శకుడు అడగగానే వాయిస్ ఓవర్ అందించాడు. అయితే మళ్లీ పాత సెంటిమెంట్ ప్రకారం మహేష్ బాబు నుంచి ఆ తర్వాత వచ్చిన సినిమా బ్రహ్మోత్సవం మరో డిజాస్టర్ గా నిలిచింది.

ఇప్పుడు ఆచార్య కోసం..
మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన ప్రతిసారి కూడా ఊహించని విధంగా బిగ్గెస్ట్ డిజాస్టర్ ను సొంతం చేసుకోవాలని వచ్చింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా కూడా మహేష్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు నుంచి సర్కారు వారి పాట సినిమా రాబోతోంది. దీంతో ముందు సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా కూడా ఆ ప్రభావం చూపుతోందో? ఏమో అని ఓ వర్గం ప్రేక్షకులలో ఆందోళన అయితే కొనసాగుతోంది.

బ్రేక్ చేస్తాడా?
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక డిఫరెంట్ లుక్ తో కనిపించబోతున్నాడు. మరి పాత సెంటిమెంట్ ప్రకారం మహేష్ బాబు డిజాస్టర్ ఎదుర్కొంటాడా? లేక ఈ సినిమాతో ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడా లేదా అనేది చూడాలి. ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











