జగన్ నిర్మాతగా పవన్ కళ్యాణ్ సినిమా??
గత కొద్ది రోజులుగా ఫిల్మ్ సర్కిల్సో లో వినపడుతున్న హాట్ టాపిక్ ఇదే. పవన్ కళ్యాణ్ చిత్రానికి జగన్ ప్రొడ్యూస్ చేస్తున్నాడట అని. అందులోనూ ఆ చిత్రం మరేదో కాదని ..గతంలో పవన్,సింగీతం కాంబినేషన్ లో ప్రారంభమై ఆగిపోయిన చిత్రం అని చెప్తున్నారు. ప్రిన్స్ ఆఫ్ పీస్ టైటిల్ తో ప్రారంభమైన ఆ చిత్రం అప్పట్లో బడ్జెట్ సహకరించకపోవటంతో ఆగిపోయింది. అయితే ఇప్పుడు జగన్ ముందుకు వచ్చి ఆ చిత్రాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడని చెప్పుకుంటున్నారు. అయితే ఈ చిత్రం ద్వారా జగన్ ఏం ఆశిస్తున్నాడు...రాజకీయ లబ్దా లేక మరేదన్నా అనేది తెలియటం లేదంటున్నారు.
ప్రిన్స్ ఆఫ్ పీస్ విషయానికి వస్తే...అప్పట్లో...పవన్ కళ్యాణ్, సింగీతం శ్రీనివాస రావు కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఇంగ్లీష్ వెర్షన్ కి ప్రిన్స్ ఆఫ్ పీస్ అనే టైటిల్ ని నిర్ణయించారు. జీసస్ క్రిస్ట్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్నఆ చిత్రంలో పవన్ ఓ ఫిల్మ్ డైరక్టర్ గా కనపించనున్నారు. ఇక గతంలో బాలకృష్ణతో 'విజయేంద్రవర్మ', నాగార్జునతో 'శ్రీరామదాసు' నిర్మించిన ఆదిత్య ప్రొడక్షన్స్ సంస్థ కొండా కృష్ణంరాజు ఈ సినిమా నిర్మిస్తున్నారని తెలిసింది. ఈ మేరకు మీడియాలో ప్రకటనలు కూడా వచ్చాయి.
జెకె.భారవి కథను సమకూర్చిన ఈ చిత్రం ఆంగ్లంతోపాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళ నిర్మితమవుతుందన్నారు. దైవ కుమారుడిగా క్రీస్తు రాక నుంచి మొదలయ్యే ఈ కథలో పాత్రల కోసం 10 నుంచి 14 సంవత్సరాలలోపు బాల బాలికల్నే ఎంపిక చేసుకుని నటింపచేసారు. క్రీస్తు, మేరీ మాత పాత్రలకు ప్రముఖుల పిల్లల్ని తీసుకున్నట్లు తెలిసింది. 14 సంవత్సరాల బాలుణ్ని 30 సంవత్సరాల క్రీస్తుగా చూపించేందుకు ప్రత్యేక మేకప్ సూత్రాల్ని పాటించారని చెప్పుకున్నారు.
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రం గబ్బర్ సింగ్ హడావిడిలో ఉన్నారు. మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. హిందీ హిట్ చిత్రం దబాంగ్ రీమేక్ గా రూపొందే ఈ చిత్రం మళ్లీ పవన్ కి ఓ పెద్ద హిట్ ఇస్తుందని భావిస్తున్నారు. పవన్ సరసన ఈ చిత్రంలో శృతిహాసన్ నటిస్తోంది. షాక్,మిరపకాయ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. పంచ్ డైలాగులు,పాటలు, పవన్ స్టైల్స్ ఈ చిత్రానికి కీలకమై నిలుస్తాయని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











