నాగార్జున లాగికొడితే ఆ పని చేశా.. ఆ తర్వాత రాడ్లతో దాది.. జేడీ చక్రవర్తి షాకింగ్
చిత్ర ఇండస్ట్రీలో తోటి హీరోలు, నటీనటుల మధ్య మనస్పర్ధలు, ఈగోలు కామన్. కొందరు వీటిని చూసీచూడనట్లుగా వదిలేస్తే మరికొందరు మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుని కక్ష సాధిస్తూ ఉంటారు. ఈ వివాదాల కారణంగా మిగిలిన వారు నలిగిపోతూ ఉంటారు. ఎవరికీ వారు నేనెందుకు తగ్గాలంటే.. నేనెందుకు తగ్గాలని భీష్మించుకుని కూర్చొంటారు. కానీ గొడవను సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకునేవారు బహు అరుదు. ఆ దూరం అలాగే పెరిగిపోయి.. సంవత్సరాల తరబడి ఎడమొహం పెడమొహంగా ఉన్నవారు ఎందరో. ఈ సంగతి పక్కనబెడితే.. నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి జీవితంలో జరిగిన ఘటనపై చిత్ర పరిశ్రమతో పాటు అభిమానుల్లోనూ ఇప్పటికీ చర్చకు కారణమైంది. అదేంటో చూస్తే.
తెలుగు సినిమా గతిని మార్చిన క్రియేటివ్ జీనియస్ రామ్ గోపాల్ వర్మ పరిశ్రమకు పరిచయం చేసిన నటీనటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. శివ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూనే, విలన్గానూ ఆకట్టుకున్నారు. అనంతర కాలంలో హీరోగా, నటుడిగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మూసలో కొట్టుకుపోకుండా విభిన్నమైన రోల్స్ చేస్తూ వర్మకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నారు. తొలినాళ్లలో జేడీ చక్రవర్తి తెరపై కనిపిస్తే చాలు అమ్మాయిలు.. రౌడీగాడు వచ్చాడ్రా అనుకునేవారు.. కానీ తర్వాతి రోజుల్లో ఎంతోమంది ఆడపిల్లల కలల రాకుమారుడు అనుకున్నారు.

టీవీల్లో జేడీ చక్రవర్తి పాట వస్తోందంటే.. అమ్మాయిలు పరుగులు తీసి మరీ చూడటం నేను చూశానని మెగాస్టార్ చిరంజీవి అంతటి వ్యక్తి అన్నారంటే జేడీకి లేడీస్లో ఏ రేంజ్లో ఫాలోయింగ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. అనగనగా ఒకరోజు, వన్బై టూ, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా, నేను ప్రేమిస్తున్నాను, ప్రేమకు వేళాయెరా వంటి చిత్రాలు జేడీ చక్రవర్తికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే తర్వాత ఎందుకో ఆయన సినీ పరిశ్రమకు దూరమయ్యారు. కానీ మళ్లీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్లో ఓటీటీలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
జేడీ చక్రవర్తిని అగ్ర కథానాయకుడు నాగార్జున కొట్టారన్న వార్త అప్పట్లో గుప్పుమంది..నేటికీ ఈ విషయంపై ఎక్కడో ఓ చోట చక్కర్లు కొడుతూనే ఉంది. ఇటీవల ఓ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన జేడీకి ఇదే ప్రశ్న ఎదురవ్వగా ఆయన అసలు విషయంపై క్లారిటీ ఇచ్చారు. శివ షూటింగ్ సమయంలో నాగార్జున హోటల్లో భోజనం చేసి బయటకు వస్తున్నారని, ఆయన వస్తున్న విషయం తాను గమనించలేదని.. ఏదో ఆలోచించుకుంటూ వస్తుండగా నా భుజం ఆయనకు తగిలిందని జేడీ తెలిపారు. దీంతో కోప్పడిన నాగార్జున.. ఎటు చూసి నడుస్తున్నావ్ అంటూ తనపై సీరియస్ అయ్యారని , దానికి తాను కూడా చూడలేదని ఘాటుగా సమాధానం చెప్పానని అన్నారు.
అప్పటికే కోపంతో ఊగిపోయిన నాగార్జున ఏంట్రా ఇంకా మాట్లాడుతున్నావ్ అంటూ లాగి కొట్టారని .. దాంతో తాను కిందపడిపోయానని .. నాక్కూడా కోపం నషాళానికి అంటడంతో లేచి నాగార్జున కాలర్ పట్టుకున్నానని జేడీ చక్రవర్తి చెప్పారు. అది చూసిన అన్నపూర్ణ స్టూడియోలో పనిచేసే డ్రైవర్లు, ఇతర సిబ్బంది రాడ్లు, కర్రలు పట్టుకుని తన తల పగలగొట్టడానికి పరిగెత్తుకొచ్చారని తెలిపారు. వెంటనే నాగార్జున తనను గట్టిగా వాటేసుకుని.. లోపలికి తీసుకెళ్లారని , ఈ పరిణామంతో అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కాలేదన్నారు. నిజానికి నాగ్ - జేడీ చక్రవర్తి మధ్య జరిగింది నిజమైన గొడవ కాదు.. అదంతా షూటింగ్లో భాగమట.
విపరీతంగా జనం రావడంతో తాము తొలుత షూటింగ్ చేయలేకపోయామని.. దీంతో రామ్ గోపాల్ వర్మ ఈ సీన్ను రియలిస్టిక్గా తీయాలని ప్లాన్ చేశారని జేడీ చెప్పారు. షూటింగ్ ఆపేసి రెండు కెమెరాలు పైన పెట్టేసి ఇద్దరు సహజంగానే ఫైట్ చేసుకోవాలని .. అది రియల్ ఫైట్ అనుకోవాలని ఆర్డర్ వేయడంతో తాను , నాగార్జున అలాగే చేశామని .. ఈ విషయం నలుగురు ఐదుగురికి మించి ఎవరికీ తెలియదని జేడీ చక్రవర్తి అసలు మేటర్ రివీల్ చేశారు.


Click it and Unblock the Notifications











