‘అలాంటి వాళ్లే ఇండస్ట్రీలో టార్గెట్.. ఆ కేసులో నన్ను అలా ఇరికించి’
ఎన్నో ఆశలు, అంచనాలతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టే నటీనటులకు ఇక్కడి లోతు తెలిసేసరికి జీవితాలు తెల్లారిపోతాయి. గాడ్ ఫాదర్ లేకుండా ఇక్కడ నిలదొక్కుకోవడం కష్టమని, అడుగడుగునా అవరోధాలు వెంటాడతాయని తెలిసేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. అలాగని ఇంటికి తిరిగి వెళ్లలేక.. ఇక్కడ నెగ్గుకురాలేక సతమతం అయ్యేవారు ఎందరో. చిత్ర పరిశ్రమలోని నెపోటిజం గురించి కూడా చాలామంది వాస్తవాలు బయటపెట్టారు. తాజాగా సినీ పరిశ్రమలోని రాజకీయాలపై ఓ యువ నటుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ వివరాల్లోకి వెళితే...
ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఫోటో అనే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేశాడు నందు. ఇన్నేళ్లయినా ఇప్పటికీ సరైన గుర్తింపు కోసం ఆయన పోరాడుతూనే ఉన్నాడు. హీరోగా కొన్ని పాత్రలు పోషించినప్పటికీ బ్రేక్ దక్కలేదు. దాంతో సహాయ నటుడిగానూ, ఇతర క్యారెక్టర్స్తోనూ నెగ్గుకుంటూ వస్తున్నాడు. స్టార్ సింగర్ గీతా మాధురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నందు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. 2017లో తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్ కేసులో నందూ పేరు తెరపైకి రావడంతో పాటు సిట్, ఈడీ విచారణకు కూడా హాజరయ్యాడు. ఈ పరిణామాలు నందుని బాగా కృంగదీశాయి. అయినప్పటికీ కోలుకుని నిలబడ్డాడు. కొద్దిరోజుల క్రితం సైక్ సిద్ధార్ధ్ సినిమాలో హీరోగా నటించాడు. సినిమాలతో పాటు బుల్లితెరపై హోస్ట్గానూ దూసుకెళ్తున్నాడు. ఇటీవల ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, డ్రగ్స్ కేసు, ఇండస్ట్రీలో రాజకీయాలపై నందూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

నా భార్య టాప్ సింగర్ .. తెలిసిన వారికి రికమండ్ చేయమని అడగొచ్చు. పూరీ జగన్నాథ్, రాజమౌళి సినిమాలకు పాటలు పాడింది. కానీ ఈరోజు వరకు నేను రాజమౌళీ గారిని హాట్ స్టార్లో ఐపీఎల్ ఈవెంట్ రోజు మాట్లాడటం తప్పించి ఏరోజు ఆయనను కలవలేదు. నా సొంత తెలివి తేటలు, టాలెంట్ మీద నాకు అవకాశాలు రావాలని నేను కోరుకుంటా. గీతా మాధురి చెబితే అవకాశాలు ఇచ్చే పరిస్ధితిలో ఇండస్ట్రీ లేదు. ఫ్యామిలీలో అంతా నన్ను చిన్నచూపు చూస్తారు. పెళ్లిళ్లు, ఫంక్షన్స్కి పిలుస్తారు. నా మీద ప్రేమతో కాదు.. గీత వస్తుందని. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పలేం. నువ్వు స్టార్వి కాదని పొడిచి పొడిచి హింసిస్తుంటారని నందూ పేర్కొన్నారు.
ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల సినిమాలలో అవకాశమైతే వస్తుంది. ఆడియన్స్ హిట్ ఇవ్వాలి కదా? ఇండస్ట్రీలో రెండే కులాలు.. ఒకటి డబ్బున్న కులం, డబ్బులేని కులం. నేను పెద్ద హీరో అయితే నా కొడుకుని నేను కూడా హీరోని చేస్తా.. కానీ జనం రిసీవ్ చేసుకోవాలి కదా? నెపోటిజం గురించి బయట చెప్పినదానికి ఇండస్ట్రీలో ఉన్న దానికి చాలా తేడా ఉంది. సవారి సినిమా తర్వాత ఒక పెద్ద బ్యానర్ నుంచి నాకు పిలుపొచ్చింది.. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా, నేను హీరోగా ఒక మలయాళం సినిమా రీమేక్ ఆఫర్ వచ్చింది. చాలా ఆనందపడ్డా.. ఓ ఫంక్షన్లో భోజనం చేస్తుండగా ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో వెళ్లగా విషయం చెప్పడంతో చాలా సంతోషించా. సినిమా త్వరలో సెట్స్ మీదకి వెళ్లబోతుందనగా ఆ మూవీ ఆగిపోయింది. ఎందుకు నన్ను తీసేశారు అనేది ఇప్పటికీ తెలియదు. ఒక పెద్ద సంస్థలో హీరోతో సమానమైన రోల్ ఇచ్చారు. దీని కోసం రూపాయి కూడా తీసుకోకుండా పనిచేశా. కానీ నా రోల్ మొత్తం ఎడిట్ చేసి.. వేరొకరితో రీషూట్ చేసిన సంగతి కూడా నాకు తెలియలేదు. కనీసం నన్ను తీసేసినట్లు ఫోన్ చేసి చెప్పలేదు. ఆడియో లాంచ్కి పిలవకపోయినా వెళితే.. కనీసం ముందు వరుసలో కూడా కూర్చోనివ్వలేదు. చాలా బాధపడ్డానని నందూ తెలిపారు.
నా పేరుని అనవసరమైన వివాదాల్లో ఇరికించారు. దాంతో నేను, గీతా ఒకరోజు కూర్చొని అన్ని వదిలేద్దామా? ఎక్కడికైనా వెళ్లిపోదామా? అనుకున్నాం. ఏదో హోటల్కి వెళ్లి పనిచేసుకుందామని గీత చెప్పేసింది. అసలు నందూ అనేవాడు ఈ ఫీల్డ్లో లేకపోతే నా మీద అలాంటి రూమర్ వచ్చే పరిస్ధితి లేదు. చాలామంది ఉన్నారు కదా? వాళ్ల మీద ఎందుకు రాలేదని మీరు అడగొచ్చు. బ్యాక్గ్రౌండ్లో ఎన్నో గేమ్స్ జరుగుతాయి, ఎలాంటి వాటిలో ఇరికిస్తారు అనేది చాలామందికి తెలియదు. మనం మేకపోతులా కొంతమందికి దొరికేస్తాం. బ్యాక్గ్రౌండ్ లేకపోతే వీడేం పీకగలడని కొందరు అనుకుంటారు. గీత సక్సెస్ఫుల్ సింగర్ అయినప్పటికీ నా కోసం అన్నీ వదిలేద్దామని చెప్పేసిందని నందూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications

















