తిరుమలలో దేవుడితో డ్రామాలాడారు, భారీ శిక్ష తప్పదు: శివాజీ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన , బీజేపీ కూటమి విజయం సాధించింది. కూటమి ప్రభంజనం ధాటికి వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. మంత్రులు, మాజీ మంత్రులు, వైసీపీ కీలక నేతలు ఓటమి పాలయ్యారు. దశాబ్థాలుగా తెలుగుదేశం పార్టీ గెలవని నియోజకవర్గాల్లో సైతం ఈసారి గెలుపొందడం విశేషం. ప్రభుత్వ వ్యతిరేకత కొంత కారణమైతే, నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల నుంచి మద్ధతు లభించని కారణంగా మెజారిటీ వైసీపీ అభ్యర్ధులు ఓటమి పాలయ్యారన్నది బహిరంగ రహస్యం.
దాదాపు 25 ఏళ్ల తర్వాత జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుకు మరోసారి చక్రం తిప్పే అవకాశం లభించింది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరి మద్ధతు లేకుండా ఒంటరిగా అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఈసారి మాత్రం పరిస్ధితులు రివర్స్ అయ్యాయి. ఎన్డీయేలోని మిత్రపక్షాలపై ఆధారపడి మోడీ ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుంది.

ఇదిలావుండగా .. కూటమి అపూర్వ విజయం సాధించడంపై సినీనటుడు శివాజీ హర్షం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోపల స్వామివారు కళకళలాడుతున్నారని, అప్పుడు కొంచెం తేడాగా కనిపించేవాడని పేర్కొన్నారు. అమరావతి, పోలవరాలపై శ్రీవారి సన్నిధిలో నిలబడి హామీలు ఇచ్చిన వారికి పాఠాలు నేర్పించాడని శివాజీ చురకలంటించారు.
చంద్రబాబు , పవన్ కళ్యాణ్, బీజేపీల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని ఆయన ఆకాంక్షించారు. ఆ రోజు తిట్టారు, కొట్టారని.. కానీ ఖర్మ ఎవరినీ వదిలిపెట్టక అదే ఫలితం అనుభవిస్తున్నారని శివాజీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కి స్వర్ణ యుగం మొదలైందని, ఇది శ్రీవారి నిర్ణయమని.. ఆయన దగ్గర డ్రామాలాడితే ఎవరికైనా ఇదే శిక్ష అని హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా.. జెమిని టీవీలో ఎడిటర్గా కెరీర్ ప్రారంభించిన శివాజీ , యాంకర్గానూ పనిచేశాడు. నెమ్మదిగా సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నించిన శివాజీ .. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు, ఇతర సహాయక పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగాడు. అమ్మాయి బాగుంది, వైఫ్, మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం, ఒట్టేసి చెబుతున్నా, శ్రీరామచంద్రులు, టాటా బిర్లా మధ్యలో లైలా, శివరామరాజు వంటి సినిమాలు శివాజీకి మంచి పేరు తీసుకొచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత శివాజీ రాజకీయ నాయకుడి అవతారం ఎత్తాడు. ప్రత్యేక హోదా, అమరావతి, పోలవరం తదితర అంశాలపై తన మద్ధతు ప్రకటించాడు. అమరావతి రైతుల తరపున పోరాటం కూడా చేశాడు.
కానీ అనూహ్యంగా బిగ్బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. యూత్ ముందు శివాజీ నిలబడలేడని ఒక్క వారం కూడా హౌస్లో ఉండలేడన్న స్టేజ్ నుంచి టాప్ - 5లో శివాజీ ఉండటం పక్కా అనేదాక వెళ్లాడు. హౌస్లో అడుగుపెట్టిన కొద్దిరోజులకే బిగ్బాస్ ఆట తీరును పట్టేసిన శివాజీ.. మైండ్గేమ్ ఆడాడు.
ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్లకు అండగా నిలబడి అపర చాణక్యుడిగా గుర్తింపు తెచ్చుకుని. శివాజీలో ఈ కోణం కూడా ఉందా అనేంతగా చెలరేగిపోయాడు. బిగ్బాస్ తెలుగు లోగిళ్లకు ఆయన బాగా దగ్గరయ్యారు. ఆ వెంటనే వరుస అవకాశాలు శివాజీ ఇంటి ముందు క్యూకట్టాయి. '' 90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ '' పేరుతో తెరకెక్కిన వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలోనూ సత్తా చాటాడు. త్వరలో సినిమాల్లోనూ బిజీ అయ్యేందుకు శివాజీ సిద్ధమవుతున్నారు.


Click it and Unblock the Notifications










