మమ్మల్ని వదిలి వెళ్లిన రోజు.. అల్లు రామలింగయ్యపై బన్నీ, శిరీష్ ఎమోషనల్
పద్మశ్రీ అల్లు రామలింగయ్యది తెలుగు సినీ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం. ఎన్టీఆర్, ఏఎన్నార్ తరం నుంచి యంగ్ జనరేషన్ వరకు అందరితోనూ కలిసి పని చేశారు. ఆయన తెరపై కనిపిస్తే చాలు నవ్వుల ఝల్లు కురవాల్సిందే. ఒకానొక సమయంలో అల్లు రామలింగయ్య లేని సినిమాలు విడుదలయ్యేవి కావంటే అతిశయోక్తి కాదు. అల్లు రామలింగయ్య 2004 జూలై 31న మరణించారు. చివరి వరకు కూడా సినిమా కోసమే పనిచేశారు. సినిమా గురించే ఆలోచించేవారు.
2021-2022 ఏడాదిని శత జయంతి సంవత్సరంగా సెలెబ్రేట్ చేయాలని నిర్ణయించారు. నేడు అల్లు రామలింగయ్య ఈ లోకాన్ని వదలి వెళ్లిన రోజు. ఈ సందర్భంగా అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. బన్నీ స్పందిస్తూ.. 'ఆయన మమ్మల్ని వదలి వెళ్లిన ఈ రోజు నాకు గుర్తుంది. ఆ రోజు కంటే ఇప్పుడే ఆయన గురించి ఎక్కువగా తెలుసుకున్నాను. ఆయన తన ప్రయాణంలో పడ్డ కష్టాలు, ఒడిదుడుకులు అన్నింట్లోనూ నేను కనెక్ట్ అయి ఉన్నాను.

ఓ పేద రైతుకు సినిమా పట్ల ఉన్న మక్కువే.. మేమంతా ఇక్కడ ఉండటానికి కారణమైంది. ఆయన వల్లే ఈ స్థాయిలో ఉన్నామ'ని ట్వీట్ చేశాడు. ఇక అల్లు శిరీష్ ట్వీట్ చేస్తూ.. 'స్ట్రిక్ తాతగానే నాకు ఆయన తెలుసు. సినిమా ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన క్షణం నుంచి ఆయన జీవిత ప్రయాణం, ఎదుర్కొన్న కష్టాల గురించి తెలుసుకున్నాను. మీరు ఇచ్చిన ప్రతీ దానికి ఎప్పటికీ రుణపడి ఉంటాము తాతగారు' అంటూ పేర్కొన్నాడు. కాసేపటి క్రితమే కొరటాల శివతో తన 21వ ప్రాజెక్ట్ ఉంటుందన్న విషయాన్ని బన్నీ ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











