డిఫరెంట్ టైటిల్తో రాబోతున్న కల్యాణ్ రామ్: ఆ విషయంలో తమ్ముడి బాటలోనే
కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు నందమూరి హీరో కల్యాణ్ రామ్. అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'పటాస్'తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న అతడు.. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ, సక్సెస్ను మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలను సైతం చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం రాజేంద్ర అనే నూతన దర్శకుడితో ఈ నందమూరి హీరో సినిమా చేస్తున్నాడు. దీని గురించి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.
రాజేంద్ర దర్శకత్వంలో కల్యాణ్ రామ్ నటించే ఈ సినిమా ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ మూడు పాత్రల్లో నటించబోతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఇది నిజమేనని తెలిసింది. జూనియర్ ఎన్టీఆర్ 'జై లవ కుశ'లో త్రిపాత్రాభినయం చేశాడు. దాని తర్వాత ఇప్పుడు ఈ నందమూరి హీరో అలా చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

ఇక, ఈ సినిమా టైటిల్ విషయంలోనూ ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు 'ఎమిగోస్' అనే టైటిల్ పెడుతున్నారట. డిఫరెంట్ కాన్సెప్టుతో వస్తున్న చిత్రం కావడంతోనే ఇలాంటి పేరును పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కొద్ది రోజుల క్రితమే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో జరిగాయి. ప్రొడక్షన్ నెంబర్ 14గా దీన్ని లాంచ్ చేశారు. వాస్తవానికి మార్చి నెలలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, అనివార్య కారణాల వల్ల అది కాస్తా వాయిదా పడిపోయింది.


Click it and Unblock the Notifications











