AP Election Results Live: అప్పుడే వైసీపీ పతనం మొదలైంది.. పవన్ కల్యాణ్ నిర్ణయంతో జగన్ ఓటమి అలా..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైఎస్ జగన్ పాలన మరోసారి తమకొద్దని ప్రజలు తిరస్కరించారు. కూటమి విజయానికి వ్యూహాలు, ఎత్తుగడలు, పలు అంశాలు దోహదం కారణం కావొచ్చు.. కానీ వీటికి మించి అసలైన శక్తి పవన్ కళ్యాణ్. నచ్చినా, నచ్చకున్నా ఈ విషయాన్ని ఒప్పుకుని తీరాలి. జగన్ నిన్ను ఈసారి గెలవనివ్వను, అథ:పాతాళానికి తొక్కేస్తానన్న పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగానే దానిని నిలబెట్టుకున్నారు.
అయితే రెండేళ్ల క్రితం జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన పవన్ కళ్యాణ్ను పోలీసులు అడ్డుకోవడం సంచలనం సృష్టించింది. ఎక్కడికక్కడ జనసేన నేతలను అడ్డుకోవడంతో పాటు పవన్ కళ్యాణ్ బసచేసిన హోటల్ చుట్టూ భారీగా బలగాలను మోహరించారు. అంతేకాదు.. పవన్ ప్రయాణించిన మార్గంలో విద్యుత్ సరఫరాను సైతం నిలిపివేశారు. హోటల్కు వచ్చిన పోలీసులు స్వయంగా పవన్ కళ్యాణ్కు నోటీసులు అందజేశారు. విశాఖలో పోలీస్ యాక్ట్ - 30 అమల్లో ఉన్నందున ర్యాలీలకు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని అందులో పేర్కొన్నారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో జనవాణిని రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

ఈ ఘటన పవన్ మనసులో బలంగా నాటుకుపోయింది. అప్పటి వరకు సింగిల్గా పోటీ చేయాలనుకున్న పవన్ కళ్యాణ్ను కూటమి వైపు నడిపించింది ఈ ఘటనే అని విశ్లేషకులు అంటారు. ఆ సమయంలో తనను అడ్డుకున్న పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగంపై మండిపడిన పవన్ కళ్యాణ్.. ఇంకో ఆరు నెలలే అంటూ చేతివేళ్లు చూపిస్తూ కోపంగా ముందుకు వెళ్లిన దృశ్యం ఇప్పటికీ రాష్ట్ర ప్రజల కళ్లెదుట మెదులుతూనే ఉంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం కూటమి వైపు పవన్ అడుగులు వేస్తున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. సరిగ్గా ఈ దశలోనే జగన్ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపింది.
చంద్రబాబు అరెస్ట్ను ఖండించిన పవన్ కళ్యాణ్.. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన ఆయన నడిరోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ఆపై రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును పరామర్శించి బయటకు వస్తూనే ఇకపై టీడీపీ కలిసి జనసేన సాగుతుందని పొత్తు ప్రకటన చేశారు. చంద్రబాబు బెయిల్పై విడుదలయ్యాక పొత్తు చర్చలు, ఉమ్మడి కార్యాచరణపై మంతనాలు జరిపారు. 50 నుంచి 60 స్థానాలు ఇవ్వకుంటే పొత్తు వద్దని కుల పెద్దలు హెచ్చరించినా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. అలాగే బీజేపీ కూడా కూటమిలోకి వస్తేనే ఎలక్షనీరింగ్ సరిగా చేయగలమనే ఉద్దేశంతో ఆ పార్టీని కలుపుకుని పోయేందుకు పవన్ పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కాషాయ పెద్దలతో భేటీ అయ్యారు. బీజేపీ అడిగినన్ని సీట్లు ఇవ్వడం కోసం చివరికి తనకు దక్కిన స్థానాలను కూడా వదులుకున్నారు.

అనంతరం కూటమి అభ్యర్ధుల విజయమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. తన వాడి వేడి ప్రసంగాలతో వైసీపీ ప్రభుత్వ పాలనపై విరుచుకుపడ్డారు. అటు జనసేన కేడర్ సైతం తమ అధినేతకు మద్ధతుగా రంగంలోకి దిగారు. పవన్ అభిమానుల్లో మెజారిటీ యువతరం కావడంతో వీరు సోషల్ మీడియాలో విస్త్రతంగా ప్రచారం చేశారు. దీంతో చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్లుగా కాకుండా జగన్ వర్సెస్ పవన్ అన్నట్లుగా సీన్ మారిపోయింది.
తన అభిమానులు, కాపు సామాజికవర్గం ఓటంలను గంపగుత్తగా కూటమికి తరలించడంలో పవన్ సక్సెస్ అయ్యారు. కేవలం జనసేనానిని చూసే 90 శాతం మంది కాపులు కూటమి అభ్యర్థులకు ఓట్లేశారని అంచనా. ఈ వర్గం బలంగా ఉన్న ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి , ఇతర జిల్లాల్లో కూటమికి వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ తమ సామాజికవర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత దక్కదని భావించిన కాపులు ఏకమయ్యారు. కేవలం పవన్ అనే వ్యక్తి లేకుంటే ఈ స్థాయి విజయం కూటమికి లభించేది కాదన్నది అందరూ అంగీకరించే విషయం. తాను గెలవడంతో పాటు పదేళ్లుగా సరైన ప్రాతినిథ్యం లేని జనసేనను సగర్వంగా అసెంబ్లీలో అడుగుపెట్టేలా చేయగలిగారు పవన్ .


Click it and Unblock the Notifications











