జగన్ అథోపాతాళానికి తొక్కుతా.. చెప్పినట్లే వైసీపీని మట్టికరిపించిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ , జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. 161 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంతో అధికారాన్ని కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో 151 సీట్లను, భారీగా ఓటింగ్ శాతం సొంతం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు తిరిగేసరికి ఇంతటి దారుణ పరాజయాన్ని మూటగట్టుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే కూటమి విజయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ది కీలకపాత్రగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
జగన్ని వదిలిపెట్టేది లేదని అధ: పాతాళానికి తొక్కుతానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అన్నట్లుగానే చేసి చూపించడంతో ఆయనపై కూటమి శ్రేణులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ , లోక్సభ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ పవన్ . అప్పటికే బీజేపీ - జనసేన పొత్తులో ఉండగా.. తెలుగుదేశం సింగిల్గా ఉండి, కాషాయంతో పొత్తు పెట్టుకోవాలని తీవ్ర ప్రయత్నాల్లో ఉంది. పొత్తు కుదిరితే ఓకే లేనిపక్షంలో మూడు పార్టీలు ఎవరికి వారుగా అన్నట్లు పోటీ చేస్తే జగన్ మళ్లీ సీఎం పీఠంపై కూర్చొని ప్రతిపక్షాలు లేకుండా చేస్తారని పవన్ భావించారు.

క్షేత్ర స్థాయిలో పరిస్ధితులు, తను వ్యక్తిగతంగా చేయించుకున్న సర్వేల సమాచారం ఆధారంగా చంద్రబాబుకు దగ్గరైన పవన్ ఓ మంచి సందర్భం చూసి పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును పరామర్శించి వచ్చిన పవన్ కళ్యాణ్.. మీడియాతో మాట్లాడుతూ ఇకపై టీడీపీతో కలిసి నడుస్తామని ప్రకటించారు. టీడీపీతో పొత్తుపై ఉత్కంఠకు తెరదించిన తర్వాత బీజేపీని కూడా కూటమిలోకి తెచ్చేందుకు చివరి వరకు ప్రయత్నించారు . ఈ యత్నాలు ఫలించి బీజేపీ ఆఖరి నిమిషంలో పొత్తుకు ఓకే చెప్పింది.
ఎన్నికలకు ముందు టీడీపీ , జనసేనలు కలిసి తాడేపల్లిగూడెంలో ''జెండా'' పేరుతో నిర్వహించిన భారీ బహిరంగసభలో పవన్ కళ్యాణ్ ఆవేశంగా ప్రసంగించారు. జగన్ నీకు మొగుణ్ణి నేనే.. తన పేరును తీసినప్పుడల్లా నలుగురు భార్యలని సీఎం అంటున్నారని, తనకు జరిగింది మూడు పెళ్లిళ్లేనని, మరి నాల్గో పెళ్లాం జగనే అంటూ సెటైర్లు వేశారు పవన్. తానెప్పుడు సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి గురించి మాట్లాడలేదని, మహిళలపై విమర్శలు చేయడం తన సంస్కారం కాదన్నారు .
చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమన్న పవన్ కళ్యాణ్.. ఆయన రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన నిధులు సమకూర్చగలరని, పారిశ్రామికవేత్తలను తీసుకురాగలరని చెప్పారు. తన పోరాటం అంతా రాష్ట్రం బాగు కోసమేనని, తన వ్యూహం తనకు ఉందని పవన్ తెలిపారు. అయితే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న పవన్ను ఉద్దేశిస్తూ పలువురు కాపు పెద్దలు హెచ్చరికలు చేశారు. కనీసం 40 నుంచి 50 స్థానాలను , 10 లోక్సభ సీట్లను అడగాలని పలుమార్లు బహిరంగ లేఖలు రాశారు. కానీ పవన్ మాత్రం పొత్తులో భాగంగా తనకు వచ్చిన అసెంబ్లీ, లోక్సభ స్థానాలను వదలుకోవడానికి కూడా వెనుకాడలేదు.
పొత్తు కుదుర్చుకోవడంలోనే కాదు ప్రచారంలోనూ పవన్ కళ్యాణ్ దూకుడుగా వ్యవహరించారు. కూటమి అభ్యర్ధుల తరపున ప్రచారం చేసిన ఆయన తన సభలకు పోటెత్తే భారీ జనవాహినికి వైసీపీకి ఓటేయొద్దని గట్టిగా చెప్పారు. ఈసారి జగన్ అధికారంలోకి వస్తే ఏపీని దేవుడు కూడా కాపాడలేడంటూ పవన్ ఇచ్చిన 'హల్లో ఏపీ .. బై బై వైసీపీ ' అనే నినాదం జనంలోకి దూసుకెళ్లింది. దీనికితోడు కాపు సామాజికవర్గం మొత్తం పవన్ వెంట నడిచి కూటమికి ఓట్లేయడంతో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వైసీపీ అగ్రనేతలు ఓటమిబాట పట్టాల్సి వచ్చింది. ఎన్నికల్లో విజయం సాధించడంతో రేపు ప్రభుత్వంలోనూ పవన్ క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు. మొత్తానికి జగన్ను గద్దె దించుతానన్న జనసేనాని అన్నట్లుగానే మట్టికరిపించి తన సత్తా ఏంటో చూపించారు.


Click it and Unblock the Notifications











