జీవితంలో ఓడిపోయా... హీరో శర్వానంద్ షాకింగ్ కామెంట్స్
తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు శర్వానంద్. హిట్, ఫ్లాప్లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు శర్వానంద్. కానీ ఈ హీరో హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. ఇలాగే కొనసాగితే రేసులో నిలబడటం కష్టమని శర్వా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా తన కెరీర్, జీవితంపై శర్వానంద్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
రానా, చరణ్లకు క్లాస్మేట్
విజయవాడకు చెందిన శర్వానంద్ కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్న సమయంలో హీరోలు రామ్ చరణ్, రానా దగ్గుబాటిలు శర్వానంద్కు క్లాస్మేట్స్. అలా దగ్గుబాటి, మెగా కుటుంబాలతో శర్వానంద్కు చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. ఇప్పటికీ ఇండస్ట్రీలో మంచి మిత్రులుగా వీరు కొనసాగుతున్నారు. తొలుత మోడల్గా కెరీర్ ప్రారంభించారు శర్వా. ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో నటనలో ఓనమాలు దిద్దుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో థమ్సప్ యాడ్లో నటించి శర్వానంద్ తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడ్డారు.

హిట్ కోసం వెయిటింగ్
తొలుత ఐదో తారీఖు, శంకర్ దాదా ఎంబీబీఎస్, సంక్రాంతి, లక్ష్మీ సినిమాలలో సహాయ నటుడిగా నటించారు శర్వానంద్. ఆ తర్వాత వెన్నెల, అమ్మ చెప్పింది, గమ్యం చిత్రాలతో హీరోగా తనలోని విలక్షణ నటుడిని పరిచయం చేశారు శర్వానంద్. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ప్రస్థానం, రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి, మహానుభావుడు చిత్రాలతో శర్వానంద్ రేంజ్ తారాస్థాయికి చేరింది. చివరిసారిగా పడిపడి లేచే మనసుతో హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు ఇస్తున్నారు. రణరంగం, జాను, శ్రీకరం, మహా సముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు తదితర సినిమాలు చేసినా శర్వానంద్కు హిట్ అందలేదు.
బైకర్పై శర్వానంద్ ఆశలు
ప్రస్తుతం శర్వానంద్ నటిస్తోన్న మూవీ బైకర్. సీనియర్ హీరో రాజశేఖర్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తుండగా.. మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ప్రెట్టీ బేబీ ఇటీవల విడుదలై మంచి ఆదరణను దక్కించుకుంటోంది. ఇకపోతే.. శర్వానంద్ వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన జీవితంపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
జీవితంలో ఎన్నోసార్లు ఓడిపోయాను
ఈరోజు మీ దగ్గరికి ఓ గెస్ట్లా రాలేదు.. ఒక అన్నలా వచ్చాను, నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. జీవితంలో చాలాసార్లు పడ్డాను, ఎన్నోసార్లు ఓడిపోయాను, మోసపోయాను. కానీ పడిన తర్వాత ప్రతిసారి నేర్చుకున్నాను. ఏదో ఒకటి జీవితం నేర్పించింది. మన కథ మనమే రాసుకోవాలి. బుక్ నీది..పెన్ను నీది, స్టోరీ నీది.. ఇష్టం వచ్చినట్లు రాసుకోండి అంటూ శర్వానంద్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శర్వానంద్కు అంతగా జీవితంలో ఏం జరిగింది? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











