సెన్సేషనల్ డైరెక్టర్తో చిరంజీవి సినిమా: బాలీవుడ్ నుంచి నేరుగా.. ఆ మాట చెప్పగానే ప్రకటిస్తారట
దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ స్టార్గా వెలుగొందుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. సుదీర్ఘ కాలం పాటు హీరోగా చేసిన ఆయన.. రాజకీయాల కోసం గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత 'ఖైదీ నెంబర్ 150'తో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీతో ప్రేక్షకులు ఆయనకు ఘనమైన స్వాగతం పలకడంతో.. అప్పటి నుంచి వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే నాలుగు ప్రాజెక్టులను ప్రకటించిన చిరంజీవి.. మరో సెన్సేషనల్ డైరెక్టర్తో సినిమా చేయబోతున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఎవరా డైరెక్టర్? వివరాల్లోకి వెళితే...

చరణ్తో కలిసి ‘ఆచార్య'గా వస్తున్న చిరు
రీఎంట్రీలో ఫుల్ జోష్ మీదున్న చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో చరణ్కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.

అక్కడ మోహన్ లాల్.. ఇక్కడ మెగాస్టార్
'ఆచార్య' పట్టాలపై ఉండగానే మెగాస్టార్ చిరంజీవి 'లూసీఫర్' రీమేక్ను ప్రకటించారు. మలయాళంలో మోహన్లాల్ హీరోగా మరో స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. దీన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. దీని కోసం ఆయన చాలా మార్పులు చేశారని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ ప్రారంభం కానుంది.

ఫ్లాపుల డైరెక్టర్తో ఆ మూవీ రీమేక్కు రెడీ
టాలీవుడ్లో కొన్ని చిత్రాలు చేసినా హిట్ను మాత్రం దక్కించుకోలేకపోయాడు మెహర్ రమేశ్. అతడికి మెగాస్టార్ చిరంజీవి అవకాశం ఇచ్చారు. దీంతో తమిళంలో బంపర్ హిట్ అయిన 'వేదాళం'ను తెలుగులోకి రీమేక్ చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం మెగాస్టార్ గుండు లుక్తో కనిపించబోతున్నాడని అప్పట్లో ప్రచారం జరిగింది. దీనికి కారణం అలాంటి ఫొటోను చిరు పోస్ట్ చేయడమే.

టాలెంటెడ్ డైరెక్టర్తో మరో సినిమా అనౌన్స్
తన కొత్త చిత్రాల జాబితాను.. వాటిని తెరకెక్కించే దర్శకుల వివరాలను గతంలోనే వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. అప్పుడు చెప్పినట్లే కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతోనూ సినిమా చేస్తున్నారు. ఈ విషయాన్ని 'ఉప్పెన' ఈవెంట్లో స్వయంగా వెల్లడించారాయన. ఇక, ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కూడా ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చింది. కొత్త కథతోనే ఇది రూపొందబోతుంది.

ఆ దర్శకుడితో చర్చలు.. ప్రాజెక్టు హోల్డులో
ఇప్పటికే 'ఆచార్య' మూవీని చేస్తున్న చిరంజీవి.. మరో మూడు ప్రాజెక్టులను కూడా ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో 'మహర్షి' వంటి హిట్ వచ్చినా మరో సినిమాను ప్రకటించని వంశీ పైడిపల్లితో ఇటీవల కథా పరమైన చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఈ ప్రాజెక్టు విషయంలో చిరంజీవి నుంచి ఎటువంటి స్పందనా రాలేదని తెలుస్తోంది. దీంతో ఇది హోల్డులో ఉండిపోయింది.

సెన్సేషనల్ డైరెక్టర్తో చిరంజీవి సినిమా
విజయ్ దేవరకొండతో 'అర్జున్ రెడ్డి' అనే సినిమా చేసి.. ఆ వెంటనే బాలీవుడ్లో పాగా వేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో చిరంజీవి సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ రెండు మూడు రోజుల్లో వీళ్లిద్దరూ కలిసి కథపై చర్చలు జరపబోతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. దీనికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. 'యానిమల్' పూర్తయిన వెంటనే దీన్ని ప్రారంభిస్తారని సమాచారం.


Click it and Unblock the Notifications











