'జగపతిబాబు అలా నన్ను ముంచేశాడు.. ఎంత డబ్బు నష్టపోయనంటే?"
సక్సెస్ వెంట పరుగులు తీసే చిత్ర పరిశ్రమలో విజయం సాధించిన వారిన జనం గుర్తుపెట్టుకుంటారు. అందుకే ఎంతో మంది ఇండస్ట్రీలో అడుగుపెట్టినా చివరి వరకు నిలబడేది కొందరే. విపరీతమైన పోటీ మధ్య రన్నింగ్ చేస్తూనే ఉండాలి. ఒక్క క్షణం ఆగితే మనల్ని దాటి అవతలి వాడు దూసుకెళ్లిపోతాడు. ఘనమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అద్భుమైన నటనా కౌశలం ఉన్నప్పటికీ చాలా మంది రేసులో వెనుకబడిపోయి, ఫేడ్ అవుట్ అయపోయిన దాఖలాలు ఎన్నో.
ఈ కోవలోకే వస్తారు వేణు తొట్టెంపూడి.. తెలుగు సినీ, రాజకీయ రంగాలను శాసిస్తున్న పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు లాంచింగ్ ఈజీగానే జరిగింది. 1999లో స్వయంవరం అనే సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఆయన తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకున్నాడు. ఆ వెంటనే చిరునవ్వు, హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు, పెళ్లాం ఊరెళితే, ఖుషీ ఖుషీగా, చెప్పవే చిరుగాలి, యమగోల మళ్లీ మొదలైంది, గోపీ గోపికా గోదావరి వంటి హిట్ చిత్రాల్లో నటించారు. కానీ తర్వాత ఎందుకో ఆ జోష్ కంటిన్యూ చేయలేకపోయారు వేణు.

2013లో రామాచారి సినిమాలో నటించిన తర్వాత మరో సినిమా చేయడానికి దాదాపు పదేళ్లు పట్టంది. గతేడాది రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించాడు. అయితే ఆ మూవీ అంత హిట్ కాకపోవడంతో వేణు కెరీర్కు కూడా బూస్టప్ రాలేదు. సినీరంగానికి దూరంగా వ్యాపారంలో బిజీ అయిన వేణు.. బిజినెస్ చూసుకుంటూ గడుపుతున్నారు. కరోనా మహమ్మారి భారతదేశంలో విలయతాండవం చేసిన సమయంలో వలస కూలీలు, కార్మికులకు తనకు తోచిన సాయం చేసి తన పెద్ద మనసును నిరూపించుకున్నారు. .
ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పుడూ ఏ వివాదంలోనూ తలదూర్చకుండా.. తన పని తాను చేసుకుంటూ పోయేవారు వేణు. అలాంటిది ఒకానొక సమయంలో సీనియర్ హీరో జగపతి బాబుతో ఆయనకు మనస్పర్ధలు వచ్చాయట. ఈ విషయాన్ని వేణు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. జగపతికి తనకు మంచి రిలేషన్ ఉండేదని.. ఇద్దరం కలిసి హనుమాన్ జంక్షన్, ఖుషీ ఖుషీగా సినిమాలు చేశామని ఆయన తెలిపారు. ఏదైనా సాంగ్ చేయాల్సి వస్తే వేణుతో చేసుకోండి అని జగపతి దర్శకులకు చెప్పేవారని వేణు వెల్లడించారు. హనుమాన్ జంక్షన్ ఫస్ట్ కాపీ చూసి వస్తూ.. తనను సీరియస్గా చూశారని.. మొత్తం దొబ్చేశావ్గా అని ఆటపట్టించారని వేణు గుర్తుచేసుకున్నారు.

అయితే పరిస్ధితులు ఎంతటి మంచి వ్యక్తులనైనా దూరం చేస్తుంటాయి. అలాగే జగపతి బాబుకు తనకు మధ్య ఓ చిన్న ఇన్సిడెంట్ జరిగిందని.. దీని వల్ల తాను ఆర్ధికంగా నష్టపోయానని వేణు తెలిపారు. మధ్యవర్తిగా ఉండి.. వేరే వాళ్లకి డబ్బు ఇవ్వమని చెప్పారని.. ఆయనే గ్యారంటీగా ఉండటంతో ముక్కు , మొహం తెలియని వ్యక్తికి డబ్బులు ఇచ్చి నష్టపోయానని చెప్పారు. ఇంత జరిగినా జగపతి బాబు ఏనాడూ తనకు ఫోన్ చేసి అడగలేదని.. తర్వాత ఎప్పుడూ కలిసింది కూడా లేదని వేణు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజుల్లో రూ.14 లక్షలు అనేది చాలా పెద్ద అమౌంట్ అని.. ఇది చాలా బాధ కలిగించిందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వేణు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి వేణుకి- జగపతి బాబుకి మధ్య మనస్పర్ధలు రావడానికి కారణమైన ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం తెలియరాలేదు.


Click it and Unblock the Notifications











