ఆ కలలు తీరకుండానే తిరిగిరాని లోకాలకు కృష్ణంరాజు.. ప్రభాస్తో అలాంటి సినిమా చేయాలనే కోరిక!
నటుడిగానే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయవేత్తగా కృష్ణంరాజు విజన్ డిఫరెంట్ అని సినీ, రాజకీయ వర్గాలు చెప్పుకొంటాయి. నటుడిగా రాణిస్తూనే ఇతర రంగాల్లో కూడా విజయాలను సాధించారు. కెరీర్ తొలినాళ్లలోనే వ్యాపారాలు ప్రారంభించారు. రాజకీయాల్లోకి ప్రవేశించి సక్సెస్ అయ్యారు. అయితే కృష్ణంరాజు అనుకొన్న కొన్ని ప్రాజెక్టులను బిజీగా ఉండటం వల్ల ముందుకు తీసుకెళ్లలేకపోయారు. కృష్ణంరాజుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాల్లోకి వెళితే..

ఆంధ్రరత్న దినపత్రికను ప్రారంభించి
నటుడిగా కెరీర్ తొలినాళ్లలో ఆంధ్రరత్న అనే దిన పత్రికను తన స్నేహితులతో కలిసి ప్రారంభించారు. ఆ పత్రికను మరోస్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. కృష్ణంరాజు మంచి ఫోటోగ్రాఫర్. ఆయన తీసిన ఫోటోకు రాష్ట్రస్థాయిలో అవార్డులు లభించాయి. ఆయనకు కెమెరాలు అంటే చాలా ఇష్టం. ఆయన ఏన్నో రకాల కెమెరాలను ఆయన సమకూర్చుకొన్నారు అని ఆయన సన్నిహితుల చెబుతారు. అయితే పేపర్ పెట్టాలనే కోరిక చివరి వరకు ఉందని చెబుతుంటారు.

గ్రానైట్ బిజినెస్లోకి ప్రవేశించి
కృష్ణంరాజు సినీ రంగంలో స్టార్ హీరోగా ఉంటూనే.. రకరకాల వ్యాపారాల్లో భాగస్వామ్యం అయ్యారు. 1980 దశకంలోనే గ్రానైట్ బిజినెస్లోకి అడుగుపెట్టారు. గోపికృష్ణ గ్రానైట్స్ ఇండియా లిమిటెడ్ (Gogil)ను ప్రారంభించారు. స్టాక్ మార్కెట్లో ఐపీవోగా లిస్టింగ్ చేశారు. హైదరాబాద్లోని మారెడ్పల్లిలో 1986లో గోపికృష్ణ గ్రానైట్స్ సంస్థను ఏర్పాటు చేసి.. సుమారు ఆరేళ్లపాటు కొనసాగించారు. ఇతరత్రా కారణాల వల్ల ఆ సంస్థను ముందుకు తీసుకెళ్లలేకపోయారు.

డైరెక్షన్ చేయాలనే కోరికతో
సినీ పరిశ్రమలో 5 దశాబ్దాల విశేష అనుభవం ఉన్న కృష్ణంరాజుకు దర్శకుడిగా మారాలనే ఆలోచన ఉండేది. చాలాసార్లు డైరెక్షన్ చేయాలని ప్రయత్నాలు చేశారు. కొన్ని కారణాల వల్ల అది ఆచరణకు సాధ్యం కాలేదు. అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్తో సినిమా తెరకెక్కించి తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటాలని ప్రయత్నం చేశారు. ఎప్పటికైనా భారీ ప్రాజెక్టును టేకప్ చేస్తానని ఇటీవల ఆయన చివరి స్పీచ్లో కూడా చెప్పడం గమనార్హం.

ప్రభాస్తో ఆ రెండు సినిమాలు
ప్రభాస్తో ఒక్క అడుగు, భక్త కన్నప్ప లాంటి చిత్రాలను తెరకెక్కించాలని కృష్ణంరాజు కోరుకొన్నారు. ఒక్క అడుగు సినిమాతో దర్శకుడిగా మారాలని ప్రయత్నించారు. అయితే ప్రభాస్ బిజీ షెడ్యూల్, ఆయన ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఆ ప్రాజెక్టులు తెరపైకి రాలేకపోయాయి. అలాంటి కలలు తీరకుండానే ఈ లోకం నుంచి ఆయన నిష్క్రమించారు.

కృష్ణంరాజు ఆరోగ్యం క్షీణించడం వెనుక కారణం
అయితే కృష్ణంరాజు ఆరోగ్యం క్షీణించడానికి కరోనా సమయంలో చేసిన ఓ పని అందుకు కారణమైంది. కృష్ణంరాజుకు ఒక చోటే ఉండటం చాలా కష్టం. అందుకే కరోనా సమయంలో హైదరాబాద్లోని ఓ హోటల్లో బస చేశాం. అక్కడ వ్యాయామం చేస్తూ కిందపడిపోయారు. ఆ తర్వాత కాలికి సర్జరీ జరిగింది. అప్పటి నుంచే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది అని కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ సంఘటన తర్వాత రెబల్ స్టార్ ఆరోగ్యం కుదుటపడలేదని చెబుతారు.


Click it and Unblock the Notifications











