ఇక నుంచి అదే నా టార్గెట్.. ఓటమి తర్వాత కమల్ హాసన్ ఎమోషనల్ ట్వీట్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడి ఓడిన సినీ నటుడు, మక్కల్ నీది మైయాం పార్టీ అధినేత కమల్ హాసన్ భావోద్వేగమైన సందేశాన్ని పార్టీ శ్రేణులకు, తమిళనాడు ప్రజలకు అందించారు. దక్షిణ కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ హాసన్ తన సమీప ప్రత్యర్థి, బీజేపికి చెందిన వనతి శ్రీనివాసన్ చేతిలో సుమారు 1368 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఓటమి అనంతరం ట్విట్టర్లో ఆయన స్పందిస్తూ...
Recommended Video

ఉద్దండులతో నువ్వా? నేనా?
రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన కమల్ హాసన్ జాతీయ పార్టీల కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చారు. ఎన్నికల బరిలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ కమల్తో పోటీ పడ్డారు. అయితే పార్టీ శ్రేణులను ఉత్సహ పరుస్తూ ఎన్నికల ప్రచారంలోకి దూసుకెళ్లారు.

కమల్ హాసస్ నిజాయితీపై ప్రశంసలు
ఎన్నికల ప్రచారంలో డబ్బు, మద్యం లాంటి అంశాలతో ప్రేక్షకులను ప్రలోభపెట్టకుండా అత్యంత నిజాయితీగా కమల్ వ్యవహరించడంపై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. రాజకీయాల్లో జీరో బడ్జెట్ కాన్సెప్ట్తో ఎన్నికల రణరంగంలోకి దూకి ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు. పార్టీ ప్రచారానికి అయ్యే ఖర్చు తప్ప మరో రూపంలో గెలుపుకు ఖర్చు చేయకుండా ఓటర్ల మనసును గెలుచుకొన్నారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ప్రజల తీర్పుకు కట్టుబడి
ఓటమి అనంతరం కమల్ హాసన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రజల తీర్పును శిరసావహిస్తాను. నాపై అభిమానం కురిపించి ఓటు వేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. పార్టీ గెలుపు కోసం నిరంతరం శ్రమకోడ్చిన కార్యకర్తలకు థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను అని ట్వీట్లో కమల్ పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తానని ఆయన అన్నారు.

మా లక్ష్యం అదే అంటూ..
తమిళనాడును అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమనే మా నినాదం కేవలం ఎన్నికల కోసం కాదు. మక్కల్ నీది మైయామ్ కల. జన్మభూమిని పరిరక్షించుకోవడానికి, నా భాషను, మా ప్రజలను సంక్షేమం కోసం మా పార్టీ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుంది అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు. ఇక నుంచి అవసరమైనప్పుడల్లా ప్రజా పోరాటం చేస్తానని పిలుపునిచ్చారు.


Click it and Unblock the Notifications











