భారీ ప్రాజెక్టుతో కార్తీకేయ.. ప్రముఖ నిర్మాణ సంస్థ క్రేజీ ప్రాజెక్ట్ వివరాలు ఇవే..
ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న హీరో కార్తికేయ ఆ తర్వాత ఆసక్తికరమైన కధాంశాలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు వెళుతున్నారు. ఈ మధ్యకాలంలో అజిత్ హీరోగా తెరకెక్కిన వలిమై సినిమా లో విలన్ పాత్రలో నటించిన కార్తికేయ పాన్ ఇండియా లెవెల్ లో అద్భుతమైన ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇప్పుడు ఆయన తాజా మూవీ ప్రకటన వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

బోల్డ్ అటెంప్ట్ గా
హైదరాబాదుకు చెందిన కార్తికేయ సినిమాల మీద విపరీతమైన ఆసక్తి పెంచుకున్నారు. అలా తొలుత ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఈ సినిమా నటుడిగా మంచి పేరు తెచ్చింది కానీ గుర్తింపు తెచ్చి పెట్టలేకపోయింది. ఆ తర్వాత ఆయన చేసిన ఆర్ఎక్స్ 100 సినిమా అద్భుతమైన విజయం సాధించడమే కాకుండా తెలుగులో ఒక బోల్డ్ అటెంప్ట్ గా నిలిచిపోయింది.

2021 వ సంవత్సరంలో
ఇక ఈ సినిమా తర్వాత కార్తికేయకు వరుస సినిమా అవకాశాలు దక్కాయి. ఆర్ఎక్స్ 100 సినిమా చేసిన మరో ఏడాదిలోనే ఆయన చేసిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. హిప్పీ, గుణ 369, 90 ml లాంటి సినిమాల్లో హీరోగా నటించగా నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ అనే సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. కరోనా కాలం లో కూడా షూటింగులలో జరిపి, కార్తికేయ 2021 వ సంవత్సరంలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

దేశ వ్యాప్తంగా
చావు కబురు చల్లగా, రాజా విక్రమార్క అనే సినిమాలలో రెండు విభిన్నమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కిన వలిమై సినిమాలో నరేన్ అనే ఒక డ్రగ్ అడిక్ట్ విలన్ పాత్రలో నటించి కేవలం తెలుగు- తమిళ ప్రేక్షకులను కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరినీ మెప్పించాడు.

కొత్త దర్శకుడి దర్శకత్వంలో
ఇప్పుడు ఆయన మరో ప్రతిష్ఠాత్మక బ్యానర్ లో ఒక భారీ ప్రాజెక్టు చేస్తున్నారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎట్టకేలకు విడుదలైంది. ప్రభాస్ సన్నిహితులకు సంబంధించిన యు.వి.క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు కార్తికేయ హీరోగా ఒక సినిమా చేస్తున్నట్టు ప్రకటించింది యు.వి.ప్రొడక్షన్స్ సంస్థ. కార్తికేయ హీరోగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా ప్రశాంత్ రెడ్డి చందదపు అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుందని ప్రొడక్షన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలు
ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న కార్తికేయ కూడా ప్రతిష్ఠాత్మకమైన యూవీ క్రియేషన్స్ సంస్థ అసోసియేట్ అవ్వడం చాలా గర్వంగా ఉందని అంతకు మించి సంతోషంగా ఉందని కూడా చెప్పుకొచ్చారు. ఇది కార్తికేయ ఎనిమిదవ సినిమా కాగా సినిమాలో తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ వంటివారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలున్నాయి.


Click it and Unblock the Notifications











