బతిమలాడినా పొమ్మన్నారు... దక్షిణాది హీరోలపై కిచ్చా సుదీప్ షాకింగ్ కామెంట్స్
కన్నడ సూపర్స్టార్ కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తన సొంత కష్టంతో శాండిల్వుడ్లో అగ్రనటుడిగా స్థానం సంపాదించుకున్నారు. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించిన ఆయన దక్షిణాదిలో అత్యధిక పారితోషికం అందుకునే నటుల్లో ఒకరు. కన్నడ చిత్ర పరిశ్రమకే అంకితం కాకుండా పాన్ ఇండియా రేంజ్లో ఫాలోయింగ్ ఉన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వరుసపెట్టి క్రేజీ ప్రాజెక్ట్స్లలో నటిస్తున్న సుదీప్.. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పరభాష హీరోలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
క్రికెటర్ అవ్వబోయి యాక్టర్గా
1971 సెప్టెంబర్ 2న కర్ణాటకలోని శివమొగ్గలో జన్మించారు సుదీప్. ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చదివిన ఆయన నిజానికి ఓ క్రికెటర్ కావాలని ఆశపడ్డారట. కాలేజ్ రోజుల్లో అండర్ 19 సహా పలు టోర్నీల్లో పాల్గొన్నారు సుదీప్. అయితే నటన వైపు ఆసక్తి పెంచుకున్న ఆయన ముంబైలోని ప్రఖ్యాత రోషన్ తనేజా నేషనల్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్లో శిక్షణ తీసుకున్నారు. అనంతరం 1997లో థయవ్వాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. స్పర్శ సినిమాతో హీరోగా పరిచయమైన సుదీప్కు కిచ్చాతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

ఈగకు నంది అవార్డ్
అప్పటి నుంచి అభిమానులు ఆయనను కిచ్చా సుదీప్ అని ప్రేమగా పిలుచుకుంటున్నారు. ఆ తర్వాత ఇతర భాషా చిత్రాల్లోనూ నటించాలని నిర్ణయించుకున్న సుదీప్.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రక్త చరిత్ర 1, రక్త చరిత్ర 2, పూంక్ సినిమాలలో నటించి దేశవ్యాప్తంగా పాపులారిటీ అందుకున్నారు. అనంతరం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండవర్ ఈగలో విలన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అంతేకాదు.. ఈ సినిమాలో నటనకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డ్ను అందుకున్నారు సుదీప్. తర్వాత బాహుబలి ది బిగినింగ్, సైరా నర్సింహారెడ్డిలలో కీలకపాత్ర పోషించారు.
బిగ్బాస్ హోస్ట్గా సంచలనం
సుదీప్లో నటుడే కాదు దర్శకుడు, నిర్మాత, సింగర్ , రైటర్, హోస్ట్ కూడా ఉన్నారు. వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా ఆయన సంచలనం సృష్టించారు. కన్నడ బిగ్బాస్కి హోస్ట్గా అలరిస్తున్నారు. ఎన్నో టాప్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గానూ సుదీప్ వ్యవహరిస్తున్నారు. అలాగే ఓ ట్రస్ట్ను ఏర్పాటు చేసిన ఆయన ఎందరో పేద విద్యార్ధులకు చదువు చెప్పించడంతో పాటు ఎయిడ్స్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ మ్యాక్స్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల సుదీప్ నటించిన మార్క్ మూవీ విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం బిల్లా రంగా బాద్షా సినిమాలో సుదీప్ నటిస్తున్నారు.
ఫ్రెండ్షిప్ కోసం పైసా తీసుకోలేదు
తాజాగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుదీప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కన్నడ నటులు ఇతర భాషా చిత్రాలలో చిన్న పాత్రలు, అతిథి పాత్రలు చేయడానికి వెనుకాడటం లేదని.. కానీ ఇతర పరిశ్రమలకు చెందిన స్టార్స్ మాత్రం తమ సినిమాలలో గెస్ట్ రోల్స్ పోషించడానికి అంగీకరించడం లేదని సుదీప్ ఆవేదన వ్యక్తం చేశారు. నా వరకు నేను తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో ఎన్నోసార్లు గెస్ట్ రోల్స్ చేశాను. కేవలం స్నేహితుల కోసం ఫ్రెండ్షిప్ కోసం కొన్ని సినిమాలకు కనీసం పారితోషికం కూడా తీసుకోలేదు. కానీ ఇతర భాషల నటీనటులు కన్నడ సినిమాలలో నటించడానికి రావడం లేదు. నేను వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేసినప్పటికీ వారు వెనుకాడుతున్నారు. ఇది తోటి పరిశ్రమల పట్ల ఉండాల్సిన సహాయ సహకారాలు లోపించినట్లుగా అనిపిస్తోంది.
వాళ్లు మాత్రమే నిలిచిపోతారు
శివరాజ్కుమార్ గారు కూడా తెలుగు, తమిళ చిత్రాలలో గెస్ట్ రోల్స్ చేశారు. పరిశ్రమల మధ్య పరస్పర సహకారం ఎలా ఉండాదలో ఇది నిరూపిస్తోంది. డబ్బు కంటే నేను స్నేహానికే ఎక్కువ విలువ ఇస్తాను. సల్మాన్ ఖాన్ వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేయడం వల్లే నేను దబాంగ్ 3లో నటించాను. ఇందుకోసం ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. దళపతి విజయ్ కోసమే పులి సినిమాలో నటించాను. అతను ఎవరి గురించీ చెడుగా మాట్లాడడు.. విజయ్లోని ఈ స్వభావం నాకు చాలా ఇష్టం. అమితాబ్, క్లింట్ ఈస్ట్వుడ్, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి కొందరు మాత్రమే జీవితాంతం నటిస్తూనే ఉంటారు. అభిమానులు వారిని చూస్తూ, ఆదరిస్తూనే ఉంటారు. మిగిలిన స్టార్స్ కనుమరుగైపోతారు అని సుదీప్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కిచ్చా వ్యాఖ్యలు దక్షిణాది చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్గా మారాయి.


Click it and Unblock the Notifications











