మా నట్లూ, బోల్టులు బిగిస్తారా.. మెకానిక్ ఎవరు.. డిప్యూటీ సీఎంకు హీరో మాస్ రిప్లయ్
సినీరంగం, రాజకీయ రంగం ఇండియాలో పాలు నీళ్లలా కలిసిమెలిసి ఉంటాయి. ఒకరి అవసరాలకు మరొకరు సాయం చేసుకుంటూ సమాజంపై అత్యంత ప్రభావం చూపే భిన్న ధ్రువాలు ఇవి. తొలి నుంచి సినీ ప్రముఖులతో రాజకీయ నాయకులకు మనదేశంలో సత్సంబంధాలే ఉండేవి. రాజకీయ నాయకులుగా మారిన నటులకూ ఇండియాలో కొదువ లేదు. అయితే కొన్ని రాష్ట్రాల్లో సినీనటులకు, రాజకీయ నాయకులకు పడటం లేదు. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో ఈ వాతావరణం ఎక్కువగా కనిపిస్తోంది. నటీనటులపై ఇటీవల రాజకీయ నాయకుల ఆధిపత్యం పెరుగుతోందని పరిణామాలను బట్టి అర్ధం చేసుకోవచ్చు.
తెలుగు ప్రభుత్వాలతో సినీ పరిశ్రమకు గ్యాప్
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు సినీ పరిశ్రమ ఎంతలా ఇబ్బంది పడిందో అందరికీ తెలిసిందే. టికెట్ల రేట్ల పెంపు, స్పెషల్ షోలకు అనుమతి నిరాకరించడంతో సీఎంతో మాట్లాడేందుకు టాలీవుడ్ పెద్దలు దిగొచ్చారు. ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో వివాహిత మరణించడం, అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలతో తెలుగు చిత్ర పరిశ్రమపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలబ్రెటీలు సమాజం పట్ల బాధ్యతతో మెలగాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

తమిళనాడులో ఇబ్బందికర పరిస్ధితులు
తమిళనాడులో రాజకీయాలను సినీరంగం.. సినీ పరిశ్రమను రాజకీయాలు శాసిస్తూ విచిత్ర వాతావరణం ఉంటుంది. జయలలిత సీఎంగా ఉన్న రోజుల్లో కమల్ హాసన్ సహా పలువురు నటీనటులు ఆమె ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. తమిళనాడులో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సినీ పరిశ్రమ వారికి విధేయత చూపుతూనే ఉంటుంది. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయాలను శాసించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. తన టీవీకే పార్టీ ద్వారా వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
నట్లు, బోల్టులు బిగిస్తామన్న డీకే శివకుమార్
అయితే తాజాగా కన్నడ సినీ పరిశ్రమకు, అక్కడి ప్రభుత్వానికి పడటం లేదు. గతంలో ప్రభుత్వాలకు శాండిల్వుడ్ అండగా నిలిచేది. కావేరీ జలాల వివాదం కావొచ్చు, కన్నడ భాష, కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఎలాంటి అంశంలోనైనా అక్కడి సినీ పరిశ్రమ సహాయ సహకారాలు అందించేది. ప్రభుత్వ పెద్దలు పిలుపు ఇవ్వడం ఆలస్యం సినీ ప్రముఖులు రోడ్డెక్కేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్ధితులు లేవని ప్రభుత్వ పెద్దలు మండిపడుతున్నారు. కొద్దినెలల క్రితం బెంగళూరులో జరిగిన చలన చిత్రోత్సవానికి కన్నడ సినీ ప్రముఖులు హాజరుకాకపోవడంతో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో సినీ ప్రముఖులు పాల్గొనాలని.. నటీనటులు, దర్శక, నిర్మాతలు కూడా సహాయ సహకారాలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. సినీ ప్రముఖుల తీరు మారకుంటే మీ నట్లు, బోల్టులను టైట్ చేస్తామని డీకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
డీకేకు కిచ్చా సుదీప్ కౌంటర్
ఇది జరిగిన నెలల తర్వాత ఈ వ్యవహారంపై కన్నడ అగ్రనటుడు కిచ్చా సుదీప్ స్పందించారు. మనం ప్రయాణించే వాహనాలకు కూడా నట్లు, బోల్టులు బిగించాల్సి ఉంటుందని, ఆ సమయంలో సరైన మెకానిక్ను సంప్రదిస్తామని సుదీప్ తెలిపారు. అలాంటి వారికే కారు గురించి పూర్తి అవగాహన ఉంటుందని, అలాగే పరిశ్రమకు చెందిన వ్యక్తులకు మాత్రమే ఇక్కడి పరిస్ధితులు తెలుస్తాయన్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్పై తనకు ఎంతో గౌరవం ఉందని.. అలాంటి మాటలు మాట్లాడే ముందు తమ పరిస్ధితిని కూడా అర్ధం చేసుకుంటే బాగుండేదని సుదీప్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంతో పాటు డీకే ఏ కార్యక్రమానికి పిలిచినా మేమంతా పాల్గొన్నామని సుదీప్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











